Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బిగ్ బాస్ సీజన్-7 విజేత'గా రైతుబిడ్డ - రన్నరప్‌ అమర్‌కు లక్కీ ఛాన్స్

pallavi prashanth
, సోమవారం, 18 డిశెంబరు 2023 (09:50 IST)
బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా రైతు బిడ్డ అవతరించాడు. అతని పేరు పల్లవి ప్రశాంత్. ఇపుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతుంది. తన ఆటతో ప్రేక్షకుల మనసు గెలిచి బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. ఒక యూట్యూబర్‌గా, ఫోక్ సాంగ్స్‌ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలుపెట్టిన ప్రశాంత్ ప్రయాణం ఏమీ సాఫీగా సాగలేదు. జీవితంలో ఎదురైన అనేక రకాలైన ఒడిదుడుకులకు ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. కానీ భూమిని చీల్చుకుని పైకి వచ్చే విత్తులా ఎదుగుతూ రైతుగా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో రైతు బిడ్డగా ట్రెండ్ సృష్టించి ఇపుడు బిగ్ బాస్ 7 విజేతగా నిలిచాడు. దీంతో టైటిల్‌తో పాటు రూ.35 లక్షల నగదు బహుమతి, వితారా బెజ్రా కారు, రూ.15 లక్షల విలువ చేసే డైమండ్ జ్యూవెలరీని సొంతం చేసుకున్నాడు. 
 
తన విజయంపై పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ, 'నాకు ఓటు వేసిన అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు రుణపడి ఉంటా. తెలుగు రాష్ట్రాల ముద్దు బిడ్డ.. జనం మెచ్చిన రైతు బిడ్డగా మీకు ధన్యవాదాలు చెబుతున్నా. నేను ఇక్కడకు రావాలని ఎన్నో రోజులు తిరిగా. భోజనం చేయని రోజులు కూడా ఉన్నాయి. కానీ నన్ను నేను నమ్ముకున్నా. నేను చేయగలనని అనుకున్నా. ఇదే విషయాన్ని మా బాపునకు చెప్పా. 'నీ వెనకాల నేను ఉన్నా' అని ధైర్యం చెప్పాడు. నాగార్జున సర్ని చూడగానే మాటలు రాలేదు. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. చాలా మంది జీవితాలు బాగుపడతాయి. నేను గెలుచుకున్న రూ.35 లక్షల్లో ప్రతి ఒక్క రూపాయి రైతులకే పంచుతా. మాట తప్పను. జై జవాన్.. జై కిసాన్..' అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. 
 
అలాగే, ఈ సీజన్ రన్నరప్‌గా అమర్ దీప్ నిలిచాడు. ఆ తర్వాత అమర్ మాట్లడుతూ, ఇక్కడ వరకూ వస్తానని తాను అనుకోలేదన్నాడు. అందుకు సహకరించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నానని చెప్పాడు. తన స్నేహితులు, కుటుంబం, అనంతపురం వాసుల సహకారం మర్చిపోలేనన్న అమర్.. 'ప్రశాంత్ ట్రోఫీ గెలిచాడు.. నేను మిమ్మల్ని (ప్రేక్షకులు) గెలిచాను' అంటూ కృతజ్ఞతలు చెప్పాడు. 'ఈగల్ మూవీ ప్రమోషన్స్‌లో మాస్ హీరో రవితేజ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు వచ్చి సందడి చేశారు. 
 
ఈ సందర్భంగా నాగార్జున, రవితేజ, అమర్ల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. అప్పటికి ఇంట్లో ఐదుగురు సభ్యులు ఉండగా, అమర్ బయటకు వచ్చేస్తే, రవితేజ తర్వాతి చిత్రంలో అవకాశం ఇస్తానని నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఇది విన్న అమర్ మరో ఆలోచన లేకుండా బయటకు వచ్చేందుకు ఓకే చెప్పాడు. అమర్ అభిమానానికి ఫిదా అయిన రవితేజ తన తర్వాతి చిత్రంలో కలిసి నటించే అవకాశం ఇస్తానని చెప్పడంతో అమర్ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఇదిలావుంటే, గత సెప్టెంబరు మూడో తేదీ నుంచి ప్రారంభమైన ఈ సీజన్ మొత్తం 105 రోజుల పాటు సాగింది. మొదటి రోజు 14 మందితో ప్రారంభమైన ఈ రియాలిటీ షో.. 35వ రోజు ఐదుగురు హౌస్‌లోకి వెళ్లారు. చివరకు టాప్-6లో ఫైనలిస్టుల్లో అమర్‌దీప్, అర్జున్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక్, శివాజీ, యూవర్‌లు నిలవగా, పల్లవి ప్రశాంత్ టైటిల్ విజేతగా నిలిచాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ ప్రారంభం