మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మావయ్యలలో ఒకరైన పవన్ కళ్యాణ్ గురించి తనను ఏం అడగొద్దని ఖరాకండిగా తేల్చి చెప్పేశాడు. అలాగే, మెగాస్టార్లా కష్టపడే హీరోలు నేటి యువతరంలో లేరన్నారు. అలాగే, నేల టిక్కెట్ అభిమానులను టార్గెట్ చేసేందుకు ఓ మాస్ చిత్రం చేయాలని భావించగా, దానికి సరైన దర్శకుడు బోయపాటి శ్రీను నమ్మకంతోనే 'సరైనోడు' చిత్రం తీసినట్టు చెప్పాడు. మా అంచనా సరిగ్గా సరిపోయిందన్నారు.
ఇటీవల విజయవాడలో సరైనోడు సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసింది 'సరైనోడు' చిత్ర యూనిట్. ఈ వేడుకలో అభిమానులు పవన్ గురించి మాట్లాడమని బన్నీని అభిమానులు కోరగా, చెప్పను బ్రదర్ అంటూ దాట వేశారు. తర్వాత ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోను దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ రేంజ్లో చర్చలు జరగడంపై మీరేమంటారు అని బన్నీను ప్రశ్నించగా, ఆయన మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి మీరు ఏం చెబుతారు అని ప్రశ్నించగా.. ఇప్పుడూ అదే మాట అంటున్నా.. పవన్ గురించి మాట్లాడను బ్రదర్. ఈ ప్రశ్న తప్ప ఇంకేదైనా అడగండి అని చెప్పారు. ఈ సమాధానం పవన్ కళ్యాణ్ అభిమానులకు అసంతృప్తికరంగా మారింది. అసలు చెప్పను బ్రదర్ అనే అంశం బన్నీ నోట నుండి రావడానికి కారణం ఏమై ఉంటుందా అనేది మెగా అభిమానులకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది.