నేను.. హీరోయినా..? నా ముఖం సరిగ్గా చూశారా?: రాధికా శరత్ కుమార్
భారతీరాజా, బాలచందర్ వంటి అగ్రశ్రేణి దర్శకులు సైతం తామనుకున్న నటన కనపరచకపోతే నటీనటులను కొట్టేవారని అందరికి తెలిసిందే. తన ద్వారా తెరకు పరిచయం చేసిన భాగ్యరాజ్, పాండియన్, రతీ అగ్నిహోత్రి, రాధిక, రేవతిలను
భారతీరాజా, బాలచందర్ వంటి అగ్రశ్రేణి దర్శకులు సైతం తామనుకున్న నటన కనపరచకపోతే నటీనటులను కొట్టేవారని అందరికి తెలిసిందే. తన ద్వారా తెరకు పరిచయం చేసిన భాగ్యరాజ్, పాండియన్, రతీ అగ్నిహోత్రి, రాధిక, రేవతిలను భారతీరాజా కొట్టడం జరిగింది. ఇక అలనాటి హీరోయిన్ రాధిక విషయానికి వస్తే, అటు తమిళం ఇటు తెలుగు చిత్రాల్లో వరుస సినిమాలతో తనదైన ముద్రవేసింది. ప్రతి సినిమాల్లో కూడా విభిన్న పాత్రలను పోషిస్తూ అందరిని ఆకట్టుకుంది. రాధిక సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించిందో చాలా మందికి తెలీదు. ఆ విషయాలన్నింటినీ రాధిక మీడియాతో పంచుకున్నారు.
మద్రాసులో 1977లో ఓ రోజు. భారతీరాజా అప్పుడే కొత్తగా తమిళ సినిమా దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఆయన మొదటి సినిమా తమిళంలో "'పదినారు వయదినిలే'' మంచి విజయం సాధించింది. ఆ ఉత్సాహంతో రెండో సినిమాకు కథ సిద్ధం చేసుకుంటూ, కొత్త వాళ్లతో తీయాలనే ఉద్దేశంతో నటీనటుల వెతుకులాట ప్రారంభించారు. టీనగర్లో ఓ స్నేహితుడు టీ కోసం పిలిచాడు. వాళ్లింట్లో ఆల్బమ్ చూస్తుంటే, చిలిపిగా నవ్వుతున్న ఓ అమ్మాయి ఫోటో ఆయన కంటపడింది. ఎవరీ అమ్మాయి..? అని అడిగాడు. మా పక్కింటి పిల్ల రాధిక.. అంటూ వాళ్లూ చెప్పారు.
ఆ మరుక్షణం భారతీరాజా వాళ్లింటికి వెళ్లాడు. టీనేజర్ పిల్లగా వున్న రాధిక అప్పుడే నిద్ర లేచింది. జుట్టంతా విరబోసుకుని ఇంటి ముందు గార్డెన్లో మొక్కలకు నీళ్లు పోస్తోంది. సరిగ్గా అదేసమయంలో గేటు తీసుకుని లోపలికి వచ్చిన భారతీరాజాను చూసిన దొంగ అని పొరబడి గట్టిగా రాధిక కేకలు వేసింది. దీంతో ఇంట్లో వాళ్లంతా కంగారుగా బయటికి వచ్చారు. భారతీరాజా తానొక సినిమా దర్శకుడినని చెప్పుకొని ఆ ఇంట్లో వాళ్లనంతా నమ్మించడానికి చాలా కష్టపడ్డాడట. రాధిక ఇంటికి వెళ్లి. ''ఆమెనే చూస్తూ నా సినిమాలో హీరోయిన్గా నటిస్తావా?’ అని అడిగేశాడు, రాధిక భయపడింది. ''నేనేమిటి, హీరోయిన్ ఏమిటి నన్నూ నాముఖం సరిగా చూసారా'' అని ప్రశ్నించి పగలబడినవ్వింది.
భారతీరాజా గురించి తెలిసిన రాధిక తల్లి గీతారాధ కూతురికి విషయం వివరించి, ''సెలవులే కదా చేసెయ్'' అని చెప్పి అంగీకరింపజేసింది. అంతేకాదు కొంచెం స్వరం పెంచి, రాధిక ఎవరనుకుంటున్నారు మంచి నటుడిగా పేరొందిన ఎం.ఆర్.రాధ కూతురు' అనేసింది. అంతవరకూ ఆ విషయం తెలియని భారతీరాజా ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఎం.ఆర్. రాధా అంటే తమిళ చిత్రసీమలో పేరుమోసిన విలన్, కమేడియన్.
అప్పటి తమిళ సూపర్స్టార్ ఎమ్జీఆర్ మీద కోపంతో కాల్పులు జరిపిన ముక్కోపి. అందుకే, ఈ సినిమా గొడవల ప్రభావం పిల్లల మీద పడకూడదనే రాధిక తల్లి పిల్లల్ని శ్రీలంకలో కొంతకాలం చదివించింది. తర్వాత రాధిక లండన్లో చదువుతోంది. సెలవులకి మద్రాసు వచ్చింది. ఇప్పుడు వాళ్ల ముందు సినిమా ఛాన్స్ ఉంది. అలా రాధిక ''తూర్పు వెళ్లే రైలు'' చిత్రంతో సినీ కెరీర్ను ప్రారంభించి, ఎన్నో పాత్రలకు ఆమె ప్రాణం పోసింది.