నందమూరి బాలకృష్ణ సరసన ఫ్లాష్బ్యాక్లో వచ్చే ఎపిసోడ్లో రాజసం, వీరత్వం హావభావాలు పలికించే హీరోయిన్కోసం చాలామందిని అనుకున్నాం. ఆఖరికి నయనతార బాగుటుందని ఎంపికచేశామని "సింహా" చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి, దర్శకుడు బోయపాటి శ్రీను తెలియజేశారు.
నయనతార పేరు ముందుగానే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ డేట్స్ కుదరక ఆగామని, అందుకే ఇప్పుడు ప్రకటిస్తున్నామని సింహా దర్శక నిర్మాతలు వెల్లడించారు. గత కొద్దిరోజులుగా "సింహా" సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇందులో భాగంగా.. బుధవారం నాడు పబ్లిక్ గార్డెన్స్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ రోజుతో హైదరాబాద్లో షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత వైజాగ్, బొబ్బిలి, విజయనగరం, వరంగల్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని బోయపాటి శ్రీను తెలిపారు. "సింహా"లో బాలకృష్ణ కొత్తకోణంలో కనబడతారని, లుక్, బాడీలాంగ్వేజ్ వైవిధ్యంగా ఉంటుందని అన్నారు.
ఇంకా చక్కి సంగీతం ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తుందని బోయపాటి శ్రీను చెప్పారు. జనవరి పదో తేదీతో షూటింగ్ టాకీతో పాటు మూడు పాటల చిత్రీకరణ పూర్తవుతుందని, మిగిలిన రెండు పాటలను 16వ తేదీ తర్వాత చిత్రీకరిస్తామని దర్శకుడు తెలియజేశారు.
నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ.. స్క్రిప్ట్ ప్రకారం నయనతార సరిపోతుందని యూనిట్ ఏకగ్రీవ ఆమోదం మేరకు ఎంపికచేశామన్నారు. మొదట్లో పెద్ద సినిమా అని భయపడ్డానని, కానీ 60శాతం పూర్తయ్యాక పూర్తి నమ్మకంతో ఉన్నానని తెలిపారు. బాలకృష్ణ చిత్రాల్లో ఉత్తమ చిత్రంగా సింహా ఉంటుందని, తనకు మంచి గుర్తింపు సంపాదించిపెడుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంకా ఈ చిత్రంలో స్నేహా ఉల్లాల్, నమిత, కె.ఆర్. విజయ, మలయాళ నటుడు సాయికుమార్, ఆనందభారతి తదితరులు నటిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. మహేంద్రబాబు.