Publish Date: Mon, 05 Jan 2015 (10:32 IST)
Updated Date: Mon, 05 Jan 2015 (10:33 IST)
ప్రముఖ నాటక, సినీ రచయిత, సాహితీకారుడు గణేష్ పాత్రో కేన్సర్ వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈయనకు వయస్సు 69 యేళ్ళు. ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం.
కొడుకు పుట్టాలా అనే నాటకంతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గణేష్ పాత్రో.. అనేక నాటకాలను రచించారు. వీటిలో తరంగాలు, అసురసంధ్య, పావలా, లాభం, త్రివేణి వంటివి ఉన్నాయి. అంతేకాకుండా, 1970 నుండి 1990ల వరకు అనేక సినిమాలకు సంభాషణలు, కథను అందించారు. పదిహేనేళ్ళ తర్వాత తిరిగి సినీ రంగానికొచ్చి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకు సంభాషణలు సమకూర్చారు.
ఈయన సినీ సంభాషణలు సమకూర్చిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నిర్ణయం, సీతారామయ్య గారి మనవరాలు, రుద్రవీణ, తలంబ్రాలు, ప్రేమించు పెళ్ళాడు, మయూరి, మనిషికో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మాపల్లెలో గోపాలుడు ఇలా పలు హిట్ చిత్రాలు ఉన్నాయి.