Publish Date: Mon, 08 Mar 2021 (13:39 IST)
Updated Date: Mon, 08 Mar 2021 (13:40 IST)
దక్షిణ భారతదేశానికే తలమానికంగా ఉన్న హైదరాబాద్ నగరం పేరును మార్చుతామని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హైదరాబాద్ నగర పేరును భాగ్యనగరిగా మార్చుతామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని ప్రకటించారు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మార్చితీరతామని, ఈ విషయంలో తమను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. కేవలం నగర పేరును మార్చడం మాత్రమే తమ ఉద్దేశం కాదని, సమాజంలో సైద్ధాంతిక మార్పును కూడా తీసుకువస్తామని తెలిపారు.
ఈ అంశాలపై తాము ప్రజల నుంచి మద్దతును కూడగడతామన్నారు. దీనిపై ప్రజలకు తాము అవగాహన కలిగిస్తామని చెప్పారు. భారత్లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రపంచానికే మన దేశం ఆదర్శంగా నిలుస్తోందని ఆయన తెలిపారు. కాగా, గతంలోనూ కొందరు బీజేపీ నేతలు హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మార్చుతామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పలు ప్రాంతాల పేరును మార్చిన విషయం తెల్సిందే.