వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం అశోక్నగర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	వివరాల్లోకి వెళితే.. ఖానాపూరం మండలం పర్శా తండాకు చెందిన మహిళలు పెళ్లి బట్టల షాపింగ్ కోసం ట్రాక్టర్లో నర్సంపేటకు బయలుదేరారు. మర్గం మధ్యలో అశోక్ నగర్ శివారులోని చెరువు కట్ట మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. 
 
									
										
								
																	
	 
	ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న మొత్తం ఐదుగురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న బంధువులు ఆసుపత్రికి చేరుకుని రోదించడం చూసేవారిని సైతం కలచివేసింది.
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	పెళ్లి సామగ్రి కొనుగోలు చేయడానికి ట్రాక్టర్లో 9 మంది నర్సంపేటకు బయలుదేరారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో శాంతమ్మ (40), సీత (45), గుగులోతు స్వామి (48), జాటోత్ గోవింద్( 65), జాటోత్ బుచ్చమ్మ(60) మరణించినట్లు సమాచారం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.