Publish Date: Wed, 02 Nov 2022 (15:59 IST)
Updated Date: Wed, 02 Nov 2022 (16:02 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఇక్కడ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 40 మందికిపైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే, ఈ పోలింగ్కు ఒక్క రోజు మందు ఈ నియోజకవర్గంలోని మహిళా ఓటర్లు రోడ్డెక్కారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
మునుగోడు ఉప ఎన్నికలకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండగా ఓటు వేయడానికి డబ్బులు ఎందుకు పంపిణీ చేయలేదని నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. స్ధానిక వర్గాల సమాచారం మేరకు కొరటికల్ గ్రామానికి చెందిన కొంతమంది మహిళా ఓటర్లు తమకు డబ్బు ఎందుకు పంపిణీ చేయలేదని ఓ రాజకీయ పార్టీ నేతను గట్టిగా నిలదీశారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ కావడంతో పోలింగ్ అధికారులు గ్రామానికి చేరుకుని వీడియోలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతకుముందు ఓటర్లకు పంచేందుకు ఓ దుకాణంలో ప్యాక్ చేసి ఉంచిన చికెన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.3000 నుంచి రూ.10000 వరకు ప్రధాన రాజకీయ పార్టీలు పంపిణీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.