Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెరాసకు షాకిచ్చిన ఎస్ఈసీ : హైదరాబాద్‌లో వరద సాయం పంపిణీకి బ్రేక్!

తెరాసకు షాకిచ్చిన ఎస్ఈసీ : హైదరాబాద్‌లో వరద సాయం పంపిణీకి బ్రేక్!
, బుధవారం, 18 నవంబరు 2020 (16:19 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారికి వరద సాయం పంపిణీ చేసేందుకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి రావడంతో వరద సాయం పంపిణీతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా నిలిపేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ సెక్రటరీ ఎం.అశోక్ కుమార్‌‌ ఉత్తర్వులను జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వరద సాయాన్ని ఆపేయాలని, ఎన్నికల తర్వాత యధావిధిగా వరద సాయాన్ని కొనసాగించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో వరద సాయానికి బ్రేక్ పడినట్లైంది. 
 
కాగా, ఇటీవల గత వందేళ్లలో ఎన్నడూలేని విధంగా భారీ వరదలు నగరాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. నగరంలో కురిసిన భారీ వర్షానికి నగర వాసులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల కాలనీలన్నీ మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయారు. దీన్ని గమనంలోకి తీసుకున్న కేసీఆర్ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ సహాయంగా బాధితులకు పది వేల రూపాయల చొప్పున అందించాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఇందుకోసం సీఎం కేసీఆర్ రూ.550 కోట్ల నిధులను కేటాయించారు. అయితే... ఈ పంపిణీలో భారీగా అవినీతి జరిగిందని, లబ్ధిదారులకు దక్కకుండా పక్కదారి పట్టాయని తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సర్కార్... దగ్గర్లో ఉన్న మీ సేవ లేదా ఈ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. 
 
దీంతో బాధితులు ఉదయం ఆరు గంటల నుంచే మీసేవా, ఈసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒక్కసారిగా ప్రజలు ఎగబడటంతో సర్వర్లు కూడా పనిచేయలేదు. ప్రజలు గుమిగూడటం, సర్వర్లు పనిచేయకపోవడం, ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉన్న నేపథ్యంలో వరద సాయాన్ని నిలిపేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోడీ సంకల్పం చాలా దృఢం, అందుకే: శివరాజ్ సింగ్ చౌహాన్