Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ అడ్డుకట్టకు తెలంగాణ పోలీసు పనితీరు భేష్: డిజిపి

కరోనా వైరస్ అడ్డుకట్టకు తెలంగాణ పోలీసు పనితీరు భేష్: డిజిపి
, శనివారం, 4 ఏప్రియల్ 2020 (22:52 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణలో భాగంగా రాష్ట్ర, కేంద్ర  ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్‌ను  అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి డీజీపీ పి. మహేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. 
 
లాక్ డౌన్ అమలు నేపథ్యంలో తీసుకోవాల్సిన వ్యక్తిగత జాగ్రత్తలు, లాక్‌డౌన్ మరింత సమర్థవంతంగా అమలు, విధినిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులకు శాఖాపరంగా చేపట్టిన సదుపాయాలు తదితర అంశాలపై సాయంత్రం డీజీపీ స్థాయి నుండి సబ్ ఇన్స్పెక్టర్ వరకు దాదాపు మూడు వేల మంది పోలీస్ అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
 
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం కరొనా వైరస్ వ్యాప్తి నివారణకై పోలీస్ అధికారులు నిర్విరామకృషి చేస్తున్నారని అన్నారు. లాక్ డౌన్ అమలులో పోలీసు అధికారులు మానవీయ కోణంలో విధులు  నిర్వహిస్తుండడం అభినందనీయమని, ఇందుకుగాను అన్ని వర్గాల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి అని అన్నారు.
 
విధి నిర్వహణలో వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, భద్రత అత్యంత ప్రధానమని డీజీపీ పేర్కొంటూ, విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులందరికీ వైరస్ నిరోధక పరికరాలన్నీ సమకూర్చనున్నట్లు ప్రకటించారు. లాక్ డౌన్ విధినిర్వహణలో ఉన్న హోంగార్డు అధికారి నుండి అన్ని స్థాయిల పోలీస్ అధికారుల ఆరోగ్య, సంక్షేమాన్ని చూసే బాధ్యత పోలీస్ కమిషనర్లు, ఎస్పీ లపై ఉందని స్పష్టం చేశారు.
 
కరోనా నివారణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యశాఖ అందించే మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా ప్రతి ఒక్క పోలీస్ అధికారి పాటించాలని అన్నారు. ముఖ్యంగా క్వారంటైన్ కేంద్రాలు, కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందించే ఆసుపత్రుల  వద్ద విధులు నిర్వహించే పోలీసు అధికారులు మరింత వ్యక్తిగత ఆరోగ్య రక్షణ చర్యలను చేపట్టాలని చేపట్టాలని, లాక్ డౌన్ విధులలో ఉన్నవారందరూ మాస్కులు ధరించడం, సానీటైసర్లను తప్పనిసరిగా వాడాలని డీజీపీ తెలిపారు.
 
అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్‌కు చికిత్స లేదని, కేవలం నివారణే మార్గమని అంటూ, ఈ వ్యాధి నివారణకు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ తీరుపై దేశవ్యాప్త ప్రశంసలు లభిస్తున్నాయని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. లాక్ డౌన్‌ను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
 
పోలీస్ శాఖ పని తీరుపై ప్రభుత్వం కూడా అభినందిస్తోందని, లాక్ డౌన్ అనంతరం పోలీస్ శాఖకు తగు ప్రోత్సాహకాలు ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించారు. మానవీయ కోణంలో, సమాజ భద్రత, రాష్ట్ర పురోభివృద్ధికై  నిర్విరామ కృషి చేస్తూ పోలీస్ శాఖకు తద్వారా తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మంచి పేరును తెస్తున్న పోలీస్ అధికారులందరికీ డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చివరి క్షణం వరకు నిబద్ధతతో లాక్ డౌన్ ఆచరిస్తేనే కరోనాకు అడ్డుకట్ట: గవర్నర్ బిశ్వభూషన్