Publish Date: Tue, 20 Apr 2021 (17:48 IST)
Updated Date: Tue, 20 Apr 2021 (17:51 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా, నైట్ కర్ఫ్యూను మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. ఈ కర్ఫ్యూ ఈనెలాఖరు వరకు అమల్లోవుండనుంది. అయితే, ఈ కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలతో పాటు మీడియా, పెట్రోల్ బంక్లకు మినహాయింపు ఇచ్చారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులకు రాత్రి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఈ కర్ఫ్యూలో మినహాయింపు పొందిన సర్వీసులను పరిశీలిస్తే, అత్యవసర సేవలు, పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆస్పత్రులు, ప్రయివేటు సెక్యూరిటీ సర్వీసులు, ఈ-కామర్స్ సేవలు, ఆహార పదార్థాల పంపిణీ, కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్లకు మినహాయింపు ఇచ్చారు.
విమాన, రైలు, బస్సు ప్రయాణికులకు వ్యాలిడ్ టికెట్లు ఉంటే కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. వైద్యం కోసం వెళ్లే గర్భిణులు, రోగులకు కూడా మినహాయింపు ఇచ్చారు. అంతరాష్ట్ర రవాణాకు ఎలాంటి పాసులు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అదేసమయంలో కర్ఫ్యూ అమల్లోవున్న సమయంలో ఓ ఒక్క పౌరుడు బయట తిరగడానికి వీల్లేదు. థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హోటల్స్ రాత్రి 8 గంటల తర్వాత మూసివేయాల్సిందే.