Publish Date: Wed, 23 Aug 2023 (09:40 IST)
Updated Date: Wed, 23 Aug 2023 (09:40 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ట్రాన్స్జెండర్ చరిత్ర సృష్టించారు. చరిత్రలోనే తొలిసారి వైద్య విద్యలో సీటు దక్కించుకున్నారు. తద్వారా వైద్య విద్యలో పీజీ సీటు దక్కించుకున్న ట్రాన్స్జెండర్గా నిలిచారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఖమ్మం పట్టణానికి చెందిన డాక్టర్ రుత్పాల్ జాన్ ఓ అనాథ. అయినప్పటికీ ఎంతో పట్టుదలతో చదువుకున్నారు. కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఏఆర్టీ సెంటర్లో పనిచేస్తున్నారు. వివిధ మానసిక, శారీరక సమస్యలతో వచ్చే తనలాంటి ట్రాన్స్జెండర్లతోపాటు పేద రోగులకు సేవలందిస్తున్నారు.
అయితే, వైద్య విద్యలో ఇంకా ఉన్నత చదువులు అభ్యసించాలనేది డాక్టర్ రుత్పాల్ కోరిక. ఒకవైపు పనిచేస్తూనే మరోవైపు కష్టపడి చదివి పీజీ నీట్లో ర్యాంకు సాధించారు. ఇటీవల హైదరాబాద్ ఈఎస్ఐ మెడికల్ కళాశాలలో ఎండీ ఎమర్జెన్సీ కోర్సులో సీటు సాధించారు. అయితే... ఫీజు కోసం రూ.2.50 లక్షల వరకు అవసరమయ్యాయి.
ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ చొరవతో వైద్యులు ఇతర సిబ్బంది రూ.లక్ష వరకు అందించారు. మరో రూ.1.5 లక్షలను నగరానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఎస్ఈస్ఈడీ స్వచ్ఛంద సంస్థలు సమకూర్చాయి. ఈ మేరకు వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తాను నేర్చుకున్న విద్యతో పేదలకు, తనలాంటి వారికి సేవలందిస్తానని డాక్టర్ రుత్పాల్ తెలిపారు.