Publish Date: Mon, 16 Mar 2020 (15:42 IST)
Updated Date: Mon, 16 Mar 2020 (15:43 IST)
తాను చింతమడకలోని తమ ఇంట్లో జన్మించానని, తనకు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటపుడు తాను ఎలా పౌరసత్వం నిరూపించుకోవాలని ప్రశ్నించారు. ఒకవేళ నిరూపించుకోలేక పోతే తాను భారతీయుడిని కాదా అంటూ ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ ఒక తీర్మానం చేసి, ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానం ఆమోదం తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భోజన విరామం ప్రకటించారు.
అంతకుముందు, సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభంకాగానే సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ చర్చను ప్రారంభించారు. అనంతరం అన్ని పార్టీల నేతలు తీర్మానంపై మాట్లాడారు. 'లౌకిక, ప్రజాస్వామ్యవాదులు సీఏఏపై తమ తమ పద్ధతుల్లో నిరసనలు తెలుపుతున్నాయి. సీఏఏ చట్టం దేశవ్యాప్తంగా అనుమానాలకు ఆందోళనలకు దారితీసింది. సీఏఏపై కేంద్రం పునఃసమీక్షించుకోవాలి.
స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నాం. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పున:సమీక్ష చేసుకోవాలి. కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తే మద్దతు ఇచ్చే అంశంపై ఆలోచిస్తాం. సీఏఏపై కేంద్రం పున:సమీక్షించుకోవాలి. స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నామని' సీఎం కేసీఆర్ కోరారు.
ఒక స్థాయి కుటుంబలో పుట్టిన తనకే బర్త్ సర్టిఫికేట్ లేకుంటే, ఇక దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనులు, దళితులు, కొండజాతి ప్రజల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. అందుకాకుండా దేశ విభజన సమయంలో అనేక మంది పాకిస్థాన్ నుంచి భారత్లోకి అడుగుపెట్టారన్నారు. అలాంటి వారి పరిస్థితి ఏంటని కేసీఆర్ నిలదీశారు. ఈ చట్టాన్ని అమలు చేస్తే చాలా మంది తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేక పోతారని, అలాంటివారందరినీ శిబిరాల్లో ఉంచుతారా? అని కేసీఆర్ నిలదీశారు.