నయీం గ్యాంగ్లో వీఐపీలు.. కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. పోలీసులు కూడా ఉన్నారోచ్
గ్యాంగ్స్టర్ నయీం కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. తాజాగా నయీం అనుచరుల ఆగడాలను కూడా సిట్ బయటపెడుతోంది. నయీంతో అత్యంత సన్నిహితంగా మెలిగిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు చిక్కులు తప్పేలా
గ్యాంగ్స్టర్ నయీం కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. తాజాగా నయీం అనుచరుల ఆగడాలను కూడా సిట్ బయటపెడుతోంది. నయీంతో అత్యంత సన్నిహితంగా మెలిగిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు చిక్కులు తప్పేలా లేవు. వీరు నయీంతో కలిసి సాగించిన కార్యకలాపాలకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్న సిట్ అధికారులు త్వరలో కీలక వ్యక్తులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. ఇప్పటి వరకు దర్యాప్తు అధికారులు 18 మందిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో కీలకమైన వాళ్లు ఉన్నారు.
అయితే, అసలు సూత్రధారిగా భావిస్తున్న శేషన్న కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. సికింద్రాబాదులోని ఈసీఐఎల్ సమీపంలోని ద్వారకానగర్లో నయీం అనుచరుడు సోమన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శేషన్నకు సోమన్న కొరియర్గా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు సోమన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నయీం గ్యాంగ్లో ముఖ్య అనుచరుడు అయిన శేషన్న ప్రధాన అనుచరుడు సోమన్నఇచ్చిన సమాచారం మేరకు నగరంలోని కుషాయిగూడలో సిట్ అధికారులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్యాంగ్ స్టర్ నయీం అనుచరులు శ్రీనివాస్,లక్ష్మణ్లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ స్టర్ నయీంకు సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు. నయీం అనుచరుల్లో అరెస్టయ్యే వారిలో ఒకరిద్దరు ప్రముఖ నేతలూ ఉండవచ్చని సమాచారం.
తనకు ఎవరెవరితో సంబంధాలున్నాయన్న విషయాన్ని నయీం డైరీలో రాసుకున్నాడని, వారితో జరిపిన సంభాషణల సీడీలు, దిగిన ఫొటోలనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆధారాల ఆధారంతో మరో రెండు మూడు రోజుల్లో కొన్ని కీలక అరెస్టులు జరుగవచ్చని అధికారులు భావిస్తున్నారు.