Publish Date: Fri, 11 Sep 2020 (16:41 IST)
Updated Date: Fri, 11 Sep 2020 (17:09 IST)
ఒక్క పులి కాదు.. ఒకేసారి నాలుగు పులులు దాడికి ప్రయత్నిస్తే.. ఆ పరిస్థితిని ఊహించుకుంటే ప్రాణాలు పోయినట్లుగా అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి పశువుల కాపరులకు ఎదురైంది. అయితే వారు ఏమాత్రం జడుసుకోకుండా వాటిని ప్రతిఘటించారు. వివరాల్లోకి వెళితే... పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేట బగుళ్ల గుట్ట అటవీప్రాంతంలో మళ్ళీ పెద్ద పులుల కలకలం సృష్టించాయి.
పశువుల మందపై ఒకేసారి నాలుగు పెద్దపులులు దాడికి ప్రయత్నించాయి. ఇది గమనించిన పశువుల కాపరులు అప్రమత్తమై భయపడకుండా.. శునకాల సాయంతో వాటిని వెనక్కి తరిమారు. ఆపై వెంటనే గ్రామస్తులకు సమాచారం చేరవేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు.. అటవీ ప్రాంతం నుంచి పశువుల కాపరులను క్షేమంగా గ్రామంలోకి తీసుకొచ్చారు. అయితే, పులులకు సంబంధించిన సమాచారం ఫారెస్ట్ అధికారులకు ఇచ్చినా.. వారు స్పందించలేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఈ అటవీ ప్రాంతంలో తరచూ పులులు పశువులపై దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి.