Publish Date: Wed, 14 Oct 2020 (21:07 IST)
Updated Date: Wed, 14 Oct 2020 (21:08 IST)
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్న క్రమంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని డిఐజి ఏ.వి.రంగనాధ్ సూచించారు.
బుధవారం భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జులని ఆయన పరిశీలించి పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ట్రాఫిక్ క్రమబద్దీకరణ, మరమ్మతులపై అధికారులతో చర్చించారు.
అల్పపీడనం కారణంగా వరదలతో మొత్తం రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులున్నందున ప్రజలు ప్రయాణాలు ఉపసంహరించుకోవాలని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ప్రజలు ఈ పరిస్థితులలో పోలీస్ శాఖతో సహకరించాలని ఆయన కోరారు.
ఆయన వెంట మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, హాలియా సిఐ వీర రాఘవులు నిడమనూర్ ఏస్.ఐ. కొండల్ రెడ్డి , ఇతర అధికారులున్నారు.