Publish Date: Mon, 16 Oct 2023 (13:43 IST)
Updated Date: Mon, 16 Oct 2023 (13:50 IST)
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్పై తాను పోటీ చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ఆషామాషీగా చేయలేదని మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, జమ్మికుంటలో కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్నాథ్ సింగ్ బహిరంగ సభ జరుగనుంది. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను ఈటల సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దమ్ముంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ చేసిన సవాల్పై ఆయన స్పందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు రూ.100 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి దౌర్జన్యం చేసినా.. అధికార యంత్రాంగం మొత్తాన్ని తనపై కేంద్రీకరించినా గెలిచానని వివరించారు. ఆ ఉపఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ను ఓడించటమే తన లక్ష్యమన్నారు. ఆ మేరకే గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నట్టు ఈటల స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను తాను అంత ఆషామాషీగా చేయలేదని స్పష్టం చేశారు.