Publish Date: Thu, 15 Oct 2020 (08:29 IST)
Updated Date: Thu, 15 Oct 2020 (08:30 IST)
ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు.. మరోవైపు కుంభవృష్టికారణంగా ఏర్పడిన వరద వల్ల హైదరాబాద్ నగర వాసులు నరకం అనుభవిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వరద నీటిలో బుధవారం సాయంత్రానికే 29 మందికి పైగా మృత్యువాతపడ్డారు. వీరిలో ఓ వైద్యుడు కూడా ఉన్నారు. భారీ వర్షానికి సెల్లార్లోకి వర్షపు నీరు వచ్చిచేరాయి. వీటిని తొలగించేందుకు మోటర్ ఆన్ చేయగా, విద్యుత్ షాక్ తగిలి వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం మిగిల్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరాన్ని గత మూడు రోజులుగా కుండపోత వర్షాలు భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయం తెల్సిందే. అయితే, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సతీశ్ రెడ్డి అనే వైద్యుడు స్థానిక ఎస్బీహెచ్ కాలనీలో నివసిస్తున్నాడు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆయన నివసిస్తున్న అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద నీరు రావడంతో అది నిండిపోయింది.
దీంతో బుధవారం ఉదయం నీటిని తోడేందుకు మోటార్ వేసేందుకు సతీశ్రెడ్డి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.