Publish Date: Mon, 14 Jun 2021 (12:49 IST)
Updated Date: Mon, 14 Jun 2021 (12:50 IST)
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం. తాజాగా ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ, తెలంగాణ ఆర్టీసీ నాయకుడు అశ్వద్ధామ రెడ్డి, పలువురు ఓయూ జేఏసీ నేతలు బీజేపీలో చేరారు. కాసేపట్లో వీరంతా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో బీజేపీని మరింత విస్తరించడంలో తన శ్రమ ఉంటుందని ఈటల రాజేందర్ అన్నారు. త్వరలోనే మరిన్ని జిల్లాల నుంచి బీజేపీలో చేరికలుంటాయన్నారు.