Publish Date: Fri, 16 Apr 2021 (18:21 IST)
Updated Date: Fri, 16 Apr 2021 (18:23 IST)
రాష్ట్రంలో లాక్డౌన్ లేదా కర్ఫ్యూ విధించే అవకాశం లేదని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ... "ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు రక్షణ చర్యలను పాటించాలి. మాస్కు వేసుకోవాలి, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి" అని మంత్రి శుక్రవారం హుజురాబాద్ పర్యటనలో అన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని ఆయన ప్రజలకు సూచించారు. చికిత్స కోసం ప్రజల నుండి అధిక ధరలు వసూలు చేయవద్దని ఈటెల ప్రైవేట్ ఆసుపత్రులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొంత మానవత్వాన్ని చూపించమని కోరారు.
ధాన్య సేకరణ కేంద్రాలకు రైతులు వెళ్లేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రతరం అవుతున్నందున, మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు. కాగా తెలంగాణలో రోజువారీ కేసులు 3 వేలు దాటుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు సైతం కరోన బారిన పడుతున్నారు.