Publish Date: Tue, 20 Sep 2022 (11:20 IST)
Updated Date: Tue, 20 Sep 2022 (11:26 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి. గత 2020, 2021 సంవత్సరాల్లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పండుగను జరుపుకోలేకపోయారు. ఇపుడు ఈ యేడాది అత్యంత ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు తెలంగాణ ప్రజానీకం సిద్ధమైంది. ఈ యేడాది ఈ నెల 25వ తేదీన ఈ బతుకమ్మ వేడుక జరుగనుంది.
మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. అక్టోబరు మూడో తేదీతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ బంతుకమ్మను హైదరాబాద్ నగర వాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ముఖ్యంగా, అక్టోబరు 3వ తేదీన హైదరాబాద్ ట్యాంక్ బండ వద్ద ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు.
దీంతో బతుకమ్మ నిర్వహణపై హైదరాబాద్ బీఆర్కే భవన్లో సమన్వయ కమిటి సమావేశం జరిగింది. ఇందులో సీఎస్ సోమేష్ కుమార్తో పాటు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.