తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక అక్కా చెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులను తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4)గా గుర్తించారు. వారు ఇంటి ముందు పార్క్ చేసిన కారులోకి వెళ్లగా కారు డోర్లు లాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. దీంతో కారులోని ఇద్దరు చిన్నారులకు ఊపిరాడక విగతజీవులుగా మారిపోయారు.
అయితే, సమయం గడిచేకొద్దీ చిన్నారులు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారి కోసం గాలించారు. కారులో అపస్మారకస్థితిలో ఉన్న పిల్లలను గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు రోదించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గర్భిణీని భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో దారుణం జరిగింది. నిండు గర్భిణి అయిన భార్యను కసాయి భర్త గొంతు నులిమి హత్య చేశాడు. పీఎం పాలెం ప్రాంతంలో ఉండే జ్ఞానేశ్వర్, అనూష మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో భార్య మరికొన్ని గంటల్లో ప్రసవించాల్సివుండగా, కసాయి భర్త ఏమాత్రం కనికరం లేకుండా ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తన భార్యను తానే హత్య చేసినట్టు పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో వేల కోట్ల రూపాయల మేరకు మోసం చేసిన కేసులో ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్టు చేశారు. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు బెల్జియం పోలీసులు శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏడేళ్ళుగా తప్పించుకుని తిరుగుతున్న చోక్సీని అరెస్టు చేయడం ఈ కేసు దర్యాప్తులో కీలక ముందడుగుగా అధికారులు పరిగణిస్తున్నారు.
భారత దర్యాప్తు సంస్థలు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల అభ్యర్థన మేరకు బెల్జియం అధికారులు ఈ చర్య తీసుకున్నారు. అరెస్టు సమయంలో 65 యేళ్ల చోక్సీ బెల్జియంలోని ఒక ఆస్పత్రిలో బ్లడ్ కేన్సర్కు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. మెరుగైన వైద్యం కోసం స్విట్జర్లాండ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
చోక్సీ తరపున న్యాయవాదులు మాత్రం వైద్య కారణాలను మరియు ఇతర న్యాయపరమైన అంశాలను లేవనెత్తి భారత్కు అప్పగించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీంతో చోక్సీని భారత్కు తీసుకుని రావడానికి జరుగుతున్న ప్రచారంలో మరో న్యాయపరమైన అడ్డంకి ఏర్పడింది.