జీడిమెట్ల తల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (మృతురాలు)కి ఇద్దరు కూతుర్లు. ఆమె తన కూతుళ్లతో కలిసి షాపూర్ నగర్ హెచ్ఎంటీ సొసైటీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అందులో పెద్ద కూతురు (15) షాపూర్నగర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. చిన్న కూతురు 8వ తరగతి అభ్యసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంకా తల్లిని చంపడానికే శివ అనే యువకుడితో పదో తరగతి చదువుతున్న నిందితురాలు ప్రేమ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది. శివను వదిలేసి బుద్ధిగా చదువుకోమని హెచ్చరించిన తల్లిని హతమార్చేందుకు శివను ఉపయోగించుకుంది. హైదరాబాద్ వచ్చి చంపాలని తన ప్రియుడు శివను కోరింది. చంపకపోతే అతడి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని శివను గట్టిగా బెదిరించింది. దీంతో ఆ యువకుడు తన తమ్ముడితో వచ్చి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
తల్లిని హతమార్చేందుకు కారణం తల్లి అంజలి ప్రవర్తన అని విచారణలో వెల్లడి అయ్యింది. ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, పలువురు పురుషులతో సన్నిహితంగా ఉండటంపై కూడా ఆ బాలిక అనుమానం వ్యక్తం చేస్తుండేది. ఈ విషయంలో తల్లీ, కూతుళ్లకు గొడవలు జరిగాయి. పెద్ద అమ్మాయిని అంజలి చాలాసార్లు కొట్టినట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ గొడవ కాస్త పెద్దదవడంతో 7వ తరగతిలోనే తల్లి వద్ద ఉండను అంటూ పోలీసులకు బాలిక ఫిర్యాదు చేయగా.. అంజలి తన కూతురును రెండేళ్ల పాటు గుండ్లపోచం పల్లిలోని సోదరి ఇంట్లో ఉంచింది. అయితే గత 3 నెలల క్రితమే నిందితురాలైన బాలిక తల్లి వద్దకు వచ్చింది. అయితే అప్పటికే నల్గొండకు చెందిన యువకుడితో ఇన్ స్టాగ్రామ్ ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది బాలిక. ప్రేమ వద్దని అంజలి హెచ్చరించడంతో ప్రియుడితో కలిసి హతమార్చింది.