మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కె.కవిత ఓ లేడీ డాన్ అని ఆమె చేయని దందా అంటూ ఏదీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్లు పొత్తుపెట్టుకుంటాయని ఆమె ప్రకటన చేశారు. ఈ మాటలను ఆ రెండు పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుయాష్కీ మాట్లాడుతూ, బీజేపీ వదిలిన బాణమే కవిత అని, ఆమె వెనుక పెద్ద వ్యూహమే ఉందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కవిత ఏం చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. తన అవినీతి సంపద కాపాడుకోవడానికి కవిత తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు కనుసన్నల్లోనే కవిత పని చేస్తున్నారని, బీఆర్ఎస్ను బలహీనపరిచి, బీజేపీకి లబ్ధి చేకూర్చాలన్నదే కవిత ప్లాన్ అని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకాకముందే వసూళ్ల కోసం ఏర్పాటు చేసిన సంస్థే తెలంగాణ జాగృతి అని అన్నారు. తెలంగాణ వచ్చాక రైతులకు సాయం చేస్తామన్నారు, ఇప్పటివరకు బీసీ, ఎస్సీలకు నయాపైసా సాయం ఎందుకు చేయలేదని అని మధుయాష్కీ ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడుతున్న కవితకు.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే జాగృతి సంస్థను బీసీల చేతిలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.