తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని కవిత సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవితకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కవిత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తన రాజకీయ పార్టీపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా తాను రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు. అయితే పార్టీ పెడితే తనకు కాదని.. ప్రజలకు మేలు జరగాలని కవిత వ్యాఖ్యానించారు. ఆంధ్రలో మూడు, తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, కేరళలో అయితే గల్లీకి ఒక పార్టీ ఉందని గుర్తుచేశారు.
అలాంటిది తెలంగాణలోనూ ఉండటంలో తప్పేం లేదని కవిత అన్నారు. అయితే పార్టీలు ఉండటం పెద్ద విషయం కాదని... ఆయా పార్టీలతో ప్రజలకు మేలు జరగాలని కవిత ఆకాంక్షించారు. తెలంగాణ జాగృతి సామాజిక సంస్థ అయినప్పటికీ అవసరమైతే రాజకీయాల గురించి తాను పుష్కలంగా మాట్లాడతానని స్పష్టం చేశారు.
రాజకీయాల గురించి మాట్లాడాలంటే రాజకీయ తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. కాగా తెలంగాణ జాగృతి చేపడతున్న కార్యక్రమాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకే జనం బాట కార్యక్రమాన్ని నాలుగు నెలల పాటు నిర్వహిస్తున్నానని కవిత వెల్లడించారు.