హైదరాబాద్ నగరంలోని రామంతాపూర్లోని గోకుల్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. కృష్ణాష్టమి వేడుకల్లో విద్యుత్ షాక్ తగిలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా, ఆదివారం రాత్రి స్థానికంగా రథయాత్ర జరిగింది. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురైంది. దీంతో ఆ వాహనాన్ని కొందరు యువకులు పక్కకు లాగుతున్నారు. ఆ సమయంలో తొమ్మిది మంది యువకులకు కరెంట్ షాక్ తగిలింది. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఈ పెను విషాదం సంభవించింది.
కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు.. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు.
ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకొని ప్రాథమిక చికిత్స చేపట్టి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
మృతిచెందిన వారిలో కృష్ణయాదవ్ (21), సురేశ్ యాదవ్(34), శ్రీకాంత్ రెడ్డి (35), రుద్రవికాస్ (39), రాజేంద్ర రెడ్డి (45) ఉన్నట్లు గుర్తించారు. వారి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ సైతం ఉన్నట్లు సమాచారం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.