బీఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు కారణంగా గచ్చిబౌలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైకాపా తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ లాల్.. అనంతరం బీఆర్ఎస్లో చేరారు.
2018, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ వైరా నియోజక వర్గ ఇంఛార్జిగా వున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వైరా మాజీ శాసనసభ్యులు మదన్ లాల్ అకాల మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మదన్ లాల్ చేసిన కృషి మరువలేనిదని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. నిబద్ధత నిజాయితీగల నాయకుడిని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మదన్ లాల్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.