"సమైక్య" దీక్షలతో కేసీఆర్ బెంబేలు.. అందుకేనా యాత్ర..?!!
సీమాంధ్రలో సమైక్య నినాదం మిన్నంటుతోంది. ఒకచోట దీక్ష భగ్నం చేస్తుంటే మరోచోట కొత్తగా దీక్ష పుట్టుకొస్తోంది. పార్టీలకు అతీతంగా రాజకీయ పక్షాలు, కులమతాలకు అతీతంగా ప్రజలు సమైక్య నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. దీంతో మొన్నటివరకూ మీడియా సమావేశాలకే పరిమితమైన కేసీఆర్ మరోసారి బస్సు యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు.నిన్న మీడియా సమావేశంలో చిరంజీవి చేపడుతున్న సమైక్య యాత్రను కాస్తంత వ్యంగ్యాన్ని జోడిస్తూ.. రాజకీయ పరిజ్ఞానం లేని చిరంజీవి ఏదో ఊరేగింపులు చేస్తున్నాడని వ్యాఖ్యానించిన కేసీఆర్ తెల్లారేసరికి తనుకూడా యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.దీనికి కారణం... సీమాంధ్రలో ఆయా పార్టీల నాయకులు ఉమ్మడిగా సమైక్యాంధ్రకోసం పల్లెపల్లెలో పర్యటించడంతోపాటు ఉద్యమాన్ని మరింత పటిష్టపరుస్తూ ముందుకు తీసుకవెళ్లడమే. సీమాంధ్ర దీక్షలకు భిన్నంగా తెలంగాణాలో ఆయా పార్టీల మధ్య సయోధ్య లేదు. ఉమ్మడి పర్యటనలు, దీక్షలు దాదాపుగా లేనేలేవు. తెలంగాణాలోని రెండు మూడు జిల్లాలు తప్పించి మిగిలిన చోట్ల ప్రజలలో "తెలుగు బంధం" దృఢంగా ఉన్నట్లు పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తెలుగు ప్రజలు విడిపోయేందుకు మానసికంగా సిద్ధంగా లేరని వారు అంటున్నారు.ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రాంత జిల్లాల్లో పర్యటించడం ద్వారా స్తబ్దుగా ఉన్న ప్రజలలో తెలంగాణా వాదాన్ని మరోసారి ప్రజ్వలింప చేయాలంటే యాత్ర ఒక్కటే మార్గమని కేసీఆర్ తలపోసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన సోమవారం నుంచి తెలంగాణా పర్యటన చేయనున్నట్లు భోగట్టా.మరోవైపు సీమాంధ్రలో శనివారం కోస్తాంధ్ర, రాయలసీమలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. సమైక్య నినాదాలతో సీమాంధ్ర దద్దరిల్లింది.