తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు పదకొండురోజుల పాటు నిజంగానే ఆమరణ నిరాహార దీక్ష చేశారా...? ఇది సగటు సీమాంధ్ర (రాయలసీమ+ఆంధ్ర=సీమాంధ్ర) పౌరుడి మెదడును తొలుస్తున్న సందేహం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా గత నెల 29వ తేదీన ఆమరణ నిరాహారదీక్షకు బయలుదేరిన కేసీఆర్ను మార్గమధ్యంలోనే పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించిన విషయం తెల్సిందే.
అలా... నవంబరు 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం ఏడు గంటలకల్లా పూర్తయింది. అంటే మధ్యాహ్నం పూట మాత్రమే ఆయన భోజనం తీసుకోలేదు. సాయంత్రం ఏడు గంటలకు తాజాతాజా పండ్ల రసాలను సేవించి దీక్ష విరమించినట్టు ప్రకటించారు. ఈ వార్తలను బ్రేకింగ్ న్యూస్లలో చూసిన తెలంగాణ విద్యార్థులు, ప్రజాసంస్థలు, విప్లవకళాకారులు రెచ్చిపోయి విమర్శలు గుప్పించారు.
దీంతో మళ్లీ మరుసటి రోజు (రెండోరోజు) ఉదయం దీక్షను విరమించలేదనీ, కొనసాగిస్తున్నట్టు కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు ధృవీకరించడంతో ఖమ్మం జిల్లా సబ్జైలుకు తరలించారు. అయితే, సాక్షాత్ తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగమైన ఖమ్మం జిల్లా సబ్జైలులో తనకు ప్రాణహాని ఉందని కేసీఆరే స్వయంగా ప్రకటించారు. లేనిపోని హడావిడి చేశారు. ఏకంగా మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
హెచ్ఆర్సీ ఆదేశాలకు తలొగ్గిన పోలీసులు గత్యంతరం లేని పరిస్థితుల్లో హైదరాబాద్లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)కు తరలించారు. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభమైంది. ఒకవైపు రెండు చేతుల ద్వారా సెలైన్ ఎక్కించుకుంటూ (ఫ్లూయిడ్స్ తీసుకుంటూ) ఆమ"రణ" కథను నడిపారు.
అలా.. అలా... కొనసాగిన ఈ దీక్ష 11 రోజుల పాటు సాగింది. మధ్యమధ్యలో నిజాం వైద్యులతో కేసీఆర్ ఆరోగ్యం విషమం. ప్రమాదం అంటూ స్పెషల్ బులిటెన్స్ ఇప్పిస్తూ.. రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ స్థాయిలో ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ఫలితంగా కేసీఆర్ ప్రాణాలను కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్టానం తలొగ్గిన సంగతి అందరికీ తెలిసిన కథే.
అయితే, 11 రోజుల పాటు అన్నపానీయాలు మానేసిన కేసీఆర్.. హోం మంత్రి శెట్టియార్ (చిదంబరం) సానుకూల ప్రకటన చేయగానే మీడియాతో బాగానే మాట్లాడారు. అసలే బక్కమనిషి అయిన ఆయన శరీరకాయంలో ఏమంత పెద్ద మార్పు కనిపించలేదు. కానీ, కాస్త నీరసంగా మాత్రం కనిపించారు. ఇది సాధారణమే.. ఒక పూట లేదా రోజు అన్నం తినకుంటే నీరసపడిపోవడం ఖాయం. ఇదే మార్పు కేసీఆర్లోనూ కనిపించింది.
కానీ.. పది రోజులకు పైగా దీక్ష చేసిన కేసీఆర్.. కేంద్ర ప్రకటనతో మీడియాతో గంభీరంగా ఎలా మాట్లాడగలిగారు. కేసీఆర్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిందని పదేపదే ప్రకటించిన నిజాం వైద్యులు... కేసీఆర్ ఒక్కరోజులోనే పూర్తిగా కోలుకునేలా వైద్యం చేశారా?. దీక్ష విరమించినా కనీసం నాలుగైదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంటూ వైద్యం చేయించుకోవాలని వైద్యులు చేసిన ప్రకటన ఏమైంది.
ముఖ్యంగా.. విషమస్థితికి చేరిన కేసీఆర్ ప్రాణాలను కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో అత్యవసర సేవల విభాగం (ఐసీయూ)కు తరలించి వైద్య సేవలు చేశారు. ఐసీయూలో చికిత్స పొందే రోగిని అక్కడ నుంచి నేరుగా ఇంటికి పంపడమన్నది జరగదని పలువురు వైద్యులు అంటున్నారు. ఐసీయు నుంచి మెరుగైన వార్డుకు మార్చిన తర్వాత వైద్యుల సలహా మేరకు డిశ్చార్జ్ చేస్తుంటారు.
అయితే, వీటన్నింటికతీతంగా కేసీఆర్ పట్ల వైద్యులు ప్రవర్తించిన తీరు పలు సందేహాలకు తావునిస్తోంది. అంటే... కేసీఆర్-కాంగ్రెస్ల మధ్య ముందుగానే లోపాయకారి ఒప్పందం మేరకు ఈ ఆమరణ నిరాహారదీక్షను పూర్తి చేసినట్టు సీమాంధ్ర పౌరులు ఆరోపిస్తున్నాడు. ముఖ్యంగా.. 8 యేళ్లుగా సాధించలేనిది.. కేవలం 11 రోజుల్లో కేసీఆర్ ఎలా లక్ష్యాన్ని చేరుకోగలిగాడు? ఇత్యాది ప్రశ్నలకు భూతద్ధం వేసి వెతికినా సమాధానం లభించదు. అదేమరీ రాజకీయం. కాంగ్రెస్ నేతల నైజం.