తెలంగాణాపై అటు నిశ్శబ్దం - ఇటు హోరు
గత కొద్ది రోజులుగా ప్రత్యేక తెలంగాణా కావాలంటూ తెరాస చేపట్టిన ఉద్యమతో హైదరాబాద్ సహా తెలంగాణా ప్రాంతమంతా నినాదాల జోరు సాగుతోంది. ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులంతా కలసిరావడంతో వివిధ సంఘాల ప్రతినిధులు తమవంతు మద్దతును ప్రకటించారు. హైదరాబాద్ ప్రాంతానికి ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్సు కూడా ప్రత్యేక సంఘంగా ఏర్పడి సంఘీభావం తెలియజేశారు. ఇదిలావుంటే... ప్రత్యేకంగా చలనచిత్ర రంగాన్నుంచి సరైన స్పందన రావాలని తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ గత రెండు రోజులుగా సినీ పెద్దలను అడుగుతోంది. ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తమకు మద్దతు తెలపాలని కోరుతోంది.
దాసరిని సంప్రదించిన మురళీ మోహన్ సున్నితమైన ఈ అంశంపై తెలుగుచలనచిత్రం యావత్తూ మౌనం వహిస్తోంది. మొన్న ఆది, సోమవారాల బంద్ సందర్భంగా స్టూడియోలతోపాటు షూటింగ్లు బంద్ చేశారు. ఆ తర్వాత సమస్య కొలిక్కి వస్తుందనుకుంటే ఇంకా జఠిలమవుతోంది. కనుక ఈ సమస్య ఇప్పట్లో తేలేది కాదని అర్థమయింది. మా అధ్యక్షుడు మురళీ మోహన్కు తెరాసతోపాటు పలు సంఘాలకు చెందినవారు ఫోన్లు చేయడంతో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆయన ఇండస్ట్రీ పెద్ద డాక్టర్ దాసరి నారాయణరావును సంప్రదించారు. దాసరి స్పందిస్తూ... తనకూ చాలా ఫోన్లు వచ్చాయనీ, తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని మురళీ మోహన్కు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణా సమస్య చాలా సున్నితమైన సమస్య అనీ ఇప్పుడే మనం ఏమీ చెప్పలేమనీ, సంయమనంతో వ్యవహరించాలని మరికొందరు సూచించారు. అయినా సినిమాలనేవి ఒక్క తెలంగాణాలోనే ఆడవనీ, ప్రపంచవ్యాప్తంగా వినోదాన్ని అందించే ఈ కళను అడ్డుకోవడం సరైంది కాదని మరికొందరు వాదించినట్లు సమాచారం.