తెలంగాణ ఓకే.. రాయలసీమ, ఆంధ్రల మాటేంటి!
, బుధవారం, 9 డిశెంబరు 2009 (19:46 IST)
తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఇదే తరహా ప్రతిపాదనలు మన రాష్ట్రంలోనే ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ తరహా డిమాండ్లు రాష్ట్రంలో తలెత్తుతాయని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 23 జిల్లాలు కలిగిన ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఉంది. మన రాష్ట్రంలో మూడు రీజియన్లు ఉన్నాయి. కోస్తా ఆంధ్రాలో తొమ్మిది జిల్లాలు, రాయలసీమలో నాలుగు, తెలంగాణాలో పది జిల్లాలు ఉన్నాయి. అలాగే 294 అసెంబ్లీ స్థానాలకు గాను 119 సీట్లు తెలంగాణ జిల్లాలో ఉన్నాయి. అలాగే, 42 లోక్సభ సీట్లకు గాను 17 ఎంపీ స్థానాలు ఇమిడి ఉన్నాయి. అయితే, తెరాస ఆవిర్భావంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెరాస అధినేత కేసీఆర్ గత 11 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మాజీ కేంద్ర మంత్రి ఆరోగ్యం మరింత విషమించినట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కోర్కమిటీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో బుధవారం సాయంత్రం సమావేశమైంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ, చిదంబరం, అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీలు పాల్గొన్నారు. ఇందులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రకటించి మిన్నకుండిపోయారు. తెలంగాణ అంశం 1969లో తొలిసారి తెరపైకి వచ్చింది. 1971లో తీవ్ర రూపం దాల్చింది. హింస కూడా ప్రజ్వరిల్లింది. అయితే, ఈ ఉద్యమాన్ని అప్పటి పాలకులు ఉక్కుపాదంతో అణిచి వేశారు. తెలంగాణ ఉద్యమం తెరపైకి వచ్చిన సమయంలోనే జై ఆంధ్ర, జై రాయలసీమ ఉద్యమాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ రెండింటితో పాటు సమైక్య ఆంధ్ర, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల ఏర్పాటు చేయాలని మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ మేరకు.. రాయలసీమ రాష్ట్రం కింద ఆ ప్రాంతంలోని అనంతపూరు, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి ప్రత్యేక వాదుల డిమాండ్. అలాగే, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కోస్తా తీరంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో ఉభయగోదావరి జిల్లాతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలను కలపాలన్నది ఈ ప్రాంత వాసుల వాదనగా ఉంది. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని మరికొందరు అంటున్నారు. నిజానికి ఈ తరహా ప్రతిపాదనలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతోనే వచ్చాయని చెప్పొచ్చు. తెరాస అధినేత కేసీఆర్కు చెక్ పెట్టేందుకు గాను ఆంధ్ర, రాయలసీమ, గ్రేటర్ హైదరాబాద్ నేతలను వైఎస్ రెచ్చగొట్టారు. ఫలితంగా గత ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ ఊసు కనిపించలేదు. వైఎస్సార్ దుర్మరణంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇదే అదునుగా భావించిన కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష ప్రకటనతో తెలంగాణా వాదం మరోసారి వేడెక్కింది. ఇది ఒక దశను దాటిపోయి ఉద్రిక్తంగా మారింది. దీంతో అటు కేంద్రం కూడా స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం మీద కాంగ్రెస్ కోర్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం రాయలసీమ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు.. గ్రేటర్ హైదరాబాద్పై ఓ నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని లేని పక్షంలో ఈ ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.