చిరంజీవి రాజీనామాతో తెదేపాలో రాజుకున్న వేడి
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శుక్రవారం నుంచి తిరుపతిలో దీక్ష చేస్తున్నవారికి మద్దతు తెలుపుతూ పర్యటన మొదలుపెట్టారు. దీంతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశంలో కదలిక మొదలైంది. అయితే తెలంగాణాపై ఎలా స్పందిస్తే ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుందో తెలియక తెదేపా అధినేత తలపట్టుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిది అన్నట్లుగా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండటంతో తెలుగుదేశం అధినేతకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. సమైక్యాంధ్ర రాగాన్ని అందుకోవాలంటే తెలంగాణా ప్రాంతం నుంచి ఆ పార్టీ తరపున 39 మంది ఎమ్మెల్యేలు ఎన్నికై భయపెడుతున్నారు. సమైక్యం అంటే వారందరూ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆందోళనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. అలాకాక ప్రత్యేక తెలంగాణా అంటే సీమాంధ్ర నుంచి ఎంపికైన 53 మంది తెదేపా ఎమ్మెల్యేలు ఏం చేస్తారోనన్న బెంగలో బాబు కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రకటనకోసం తెదేపా ఎదురుచూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు రాష్ట్రంలోని ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలతను వ్యక్తపరచడం వల్లనే తాము తెలంగాణాపై ప్రకటన చేశామని కేంద్ర హోం మంత్రి చిదంబరం వెల్లడించారు. ఈ నేపధ్యంలో తెలుగుదేశం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. రాజకీయాల్లో చాణక్యునిగా పేరుతెచ్చుకున్న చంద్రబాబు ఈ పరిస్థితిని ఎలా నెగ్గుక వస్తారో వేచి చూడాలి మరి.