Publish Date: Mon, 19 Aug 2019 (14:36 IST)
Updated Date: Mon, 19 Aug 2019 (14:38 IST)
సాందీపుని వద్ద బలరామ కృష్ణులు చిన్నతనంలో విద్యాభ్యాసం చేశారు. అప్పట్లో గురుదక్షిణ ఇవ్వడం ఒక సాంప్రదాయం. పుత్రశోకంతో ఆర్తనాదాలు చేస్తున్న గురుపత్నిని చూసి దయార్ద హృదయంతో మృతుడైన బాలుని కృష్ణుడు తెచ్చి గురుదక్షిణగా సమర్పించి తన ఋణం తీర్చుకున్నాడు.
మరి తన చెల్లెలు సుభద్ర కుమారుడు అభిమన్యుడు మరణిస్తే ఎందుకు బ్రతికించలేదు? అభిమన్యుని మరణం శ్రీకృష్ణుని ఎరుకతోనే జరిగిందని ఒక అపవాదం లోకంలో ఉంది. వ్యాస భారతాన్ని పరిశీలిస్తే చంద్రుని అంశలో అను పేరు గలవాడు అభిమన్యునిగా సుభద్రకు జన్మించాడు.
అలా అవతరించేందుకు చంద్రుడు దేవతలకు ఒక షరతు పెట్టాడు. నా అంశతో జన్మించిన ఇతడు పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించగలడు... అన్నాడు. అతని కుమారుడు ఉత్తరాగర్భంలో జన్మించి వంశోద్ధారకుడవుతాడన్నాడు. అలాగే అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించాడు. సైంధవుడు అడ్డుపడటం వల్ల భీమాదులు లోపలికి ప్రవేశించలేకపోయారు. దైవవిధి వక్రించి అభిమన్యుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణుడు అతనిని బ్రతికించే ప్రసక్తి రాదు.