రియో ఒలంపిక్స్లో 'భీముడు' సోదరి రెజ్లర్ సాక్షి మాలిక్... ప్రశంసలతో ముంచెత్తిన ప్రధాని
ప్రార్థనలు ఫలించాయి. నిరీక్షణకు తెరపడింది. 125 కోట్ల భారతీయుల ఆకాంక్ష నెరవేరింది. 12 రోజుల పోరాటానికి తొలి ఫలితం దక్కింది. శతాధిక సైన్యంతో వెళ్లినా... మహామహులు బరిలో ఉన్నా దరిచేరని పతకాన్ని.. మన మల్లయ
ప్రార్థనలు ఫలించాయి. నిరీక్షణకు తెరపడింది. 125 కోట్ల భారతీయుల ఆకాంక్ష నెరవేరింది. 12 రోజుల పోరాటానికి తొలి ఫలితం దక్కింది. శతాధిక సైన్యంతో వెళ్లినా... మహామహులు బరిలో ఉన్నా దరిచేరని పతకాన్ని.. మన మల్లయోధురాలు సాక్షి మాలిక్ పట్టేసింది. రియో సాక్షిగా విశ్వక్రీడల్లో భారత్కు పతక భాగ్యం కలిగించింది. మహిళల 58 కిలోల విభాగంలో కాంస్యం నెగ్గి రియోలో మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది.
క్వార్టర్స్లోనే ఓడినా రెపిచేజ్ రూపంలో దక్కిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న మాలిక్.. పతక పట్టు పట్టేదాకా విశ్రమించలేదు. మరో విభాగంలో అద్భుతంగా ఆడిన తన సహచరి వినేష్ పొగట్ గాయంతో విలవిల్లాడుతూ స్టేడియం నుంచి వైదొలుగుతుంటే చెమర్చిన భారత అభిమానుల కంట ఆనంద బాష్పాలు రాల్చేలా చేసింది. ఒక దశలో పరాజయం అంచున నిలిచినా.. ఆఖరి క్షణాల్లో అసాధారణ పోరాటంతో పతకాన్ని అందుకున్న సాక్షి... రాఖీ పండగ రోజు భారత్కు పతక బహుమతి అందించింది.
బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి తినిబెకోవాపై గెలిచింది. అంతకుముందు ‘రెప్చేజ్’ బౌట్లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్దోర్జ్(మంగోలియా)పై నెగ్గింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 2-9తో వలెరియా కొబ్లోవా(రష్యా) చేతిలో ఓడిపోయింది. అయితే సాక్షిపై నెగ్గిన రష్యా రెజ్లర్ వలెరియా కొబ్లోవా ఫైనల్కు చేరుకోవడంతో భారత రెజ్లర్కు ‘రెప్చేజ్’లో పోటీపడే అవకాశం లభించింది.
రియో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం తెచ్చిపెట్టిన సాక్షిమాలిక్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. రాఖీ రోజు భారత ఆడబిడ్డ సాక్షిమాలిక్ దేశానికి పతకం సాధించటం గర్వకారణంగా ఉందన్నారు. పతకం సాధనతో ఆమె చరిత్ర సృష్టించిందని.. దేశంలోని క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.