అంత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కామన్వెల్త్ క్రీడలను నిర్వహించే సత్తా మనకు ఉందా అంటూ వివాదాస్పద సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చేసిన తప్పుకు లెంపలేసుకున్నారు. అన్ని టెలివిజన్ ఛానల్స్కు ఫోన్ చేసి ముందుగా చేసిన ప్రకటనకు క్షమాపణ చెపుతున్నట్టు వేడుకుంది.
కామన్వెల్త్ గేమ్స్ ఘన విజయం సాధించబోతున్నాయని, స్వదేశీ అభిమానుల ముందు బాగా ఆడాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొంది. కామన్వెల్త్ గేమ్స్ భారత్లో జరుగుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. పోటీల గురించి తన వంటివారు వ్యాఖ్యానించడం తగదని పేర్కొంది. ఈ పోటీలను నిర్వహించగల సత్తా ఉంది కాబట్టే ఈ పోటీలను మనం నిర్వహిస్తున్నామని వివరణ ఇచ్చారు.
ప్రధానంగా స్వదేశంలో జరుగుతున్న ఈ క్రీడల్లో భారత తరపున పాల్గొంటున్న క్రీడాకారులు పతకాల పంట పండించగలదన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఆర్చరీలో స్వర్ణ పతకం గెలుచుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆమె మాట్లాడుతూ ఈ కామన్వెల్త్ క్రీడలు నిర్వహించే సత్తా మనకు లేదని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని క్షణాల్లోనే పెనుదుమారాన్నిరేపాయి.