పూనే వేదికగా ఆదివారం నుంచి ప్రారంభంకానున్న కామన్వెల్త్ యూత్ గేమ్స్ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులను ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారు.
అక్టోబర్ 12 నుంచి 18 వరకు జరగనున్న ఈ కామన్వెల్త్ యూత్ గేమ్స్ ప్రారంభోత్సవానికి విచ్చేయనున్నవారి వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. రాష్ట్రపతిచే ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టెన్నిస్ బ్యూటీ సానియామీర్జా తల్లి నసీమా విచ్చేయనున్నారు.
ఈమెతో పాటు పరుగుల రాణి పీటీ ఉష, వెయిట్ లిప్టర్ కరణం మల్లీశ్వరి, టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, మాజీ ఒలింపిక్ షూటింగ్ విజేత రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, లాంగ్ జంప్ క్రీడాకారిణి అంజూ బాబీ జార్జ్ విచ్చేయనున్నారు. వీరితోపాటు బీజింగ్ ఒలింపిక్ పతక విజేతలైన అభినవ్ బింద్రా, విజేందర్ సింగ్, సుశీల్ కుమార్లు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్యగాయకులచే సంగీత విభావరిని కూడా జరిపించనున్నారు. అలాగే ఈ గేమ్స్ ముగింపు కార్యక్రమానికి మాజీ క్రీడాకారుడు మిల్కా సింగ్, మాజీ భారత జట్టు స్పిన్ బౌలర్ బిషన్ సింగ్ బేడీ తదితరులు విచ్చేయనున్నారు.