డోపింగ్ వ్యవహారంలో ఒలింపిక్ క్రీడలకు దూరమైన వెయిట్ లిప్టర్ మోనికా దేవి వ్యవహారానికి సంబంధించి సాయ్ అధికారి ఒకరిపై బదిలీ వేటు పడింది. ఈ వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న టీమ్ డివిజన్ డైరెక్టర్ ఆర్.కె. నాయుడును భోపాల్కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయమై ప్రత్యేక విచారణ జరిపిన టి.ఎస్. కృష్ణమూర్తి సమర్పించిన నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజింగ్ ఒలింపిక్కు బయలుదేరేందుకు కాస్త సమయమే ఉందన్న తరుణంలో మోనిక డోపింగ్ టెస్ట్లో విఫలమైందంటూ సాయ్ వెల్లడించింది. దీంతో బీజింగ్ ఒలింపిక్కు మోనిక వెళ్లకుండా సాయ్ నిషేధించింది.
దీంతో మోనికకు మద్దతుగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనల నేపథ్యంలో మోనిక బీజింగ్ వెళ్లవచ్చంటూ రివ్యూ కమిటీ ఉత్తర్వులిచ్చినా అప్పటికే ఒలింపిక్ ఎంట్రీల గడువు ముగియడంతో మోనిక బీజింగ్ ఒలింపిక్లో పాల్గొనలేక పోయింది. ఈ వ్యవహారంలో తనకు ద్రోహం జరిగిందంటూ మోనిక పత్రికలకెక్కడంతో ప్రభుత్వం ఓ విచారణ కమిటీని నియమించింది. టి.ఎస్.కృష్ణమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ విచారణలో మోనికకు సంబంధించి ఎలాంటి ద్రోహం జరగలేదని తేలింది.
అయితే మోనిక డోపింగ్ టెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించడంలో సాయ్ ఉదాసీనతతో వ్యవహరించిందని అందుకే ఈ వ్యవహారం ఇంత రసాభాసగా మారిందని కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగానే అధికారులు సాయ్ అధికారిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.