ఈ సీజన్లో సగ భాగం వరకూ కోర్టుకు దూరంగా ఉండవలసివచ్చిన భారత్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జనవరిలో హాంకాంగ్ నగరంలో జరగనున్న క్లాసిక్ టెన్నిస్ టోర్నీపై చూపు సారించారు. గత కొంత కాలంగా మణి కట్టు గాయం నుంచి బయటపడే క్రమంలో తాను పూర్తి నైరాశ్యంలో మునిగిపోయినట్లుగా సానియా తెలిపారు.
బీజింగ్ ఒలింపిక్స్ నుంచి సానియా తన ఫాంను కోల్పోయిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్ సమయంలోనే తిరిగి మణికట్టు గాయం తిరగబెట్టడంతో సానియా తొలి సింగిల్స్ మ్యాచ్లోనే ఓటమి పాలయ్యారు. మణికట్టు గాయం మాన్పుకోవడం తప్ప మరే మార్గం లేని స్థితిని తట్టుకోవడం తనకు చాలా కష్టమైపోయిందని సానియా చెప్పారు.
ఆ రోజులు తనకు చాలా భయంకరమైన అనుభవాలు కల్గించాయని సానియా చెప్పారు. ఒక్క సారిగా తన కెరీరే ప్రమాదంలో పడినట్లనిపించిందని దీంతో పూర్తిగా నిరాశా నిస్పృహల్లో మునిగిపోయానని సానియా తెలిపారు. గాయం అనంతర కాలం చాలా కష్టంతో కూడుకున్నదని, ఎట్టకేలకు గాయం మాపుకుని తిరిగి రావడంతో తనకు సంతోషంగా ఉందని సానియా అన్నారు.
అయితే తాను తిరిగి టెన్నిస్ బరిలోకి రావడం ఇక కల్లే అనే అభిప్రాయం మాత్రం తనకు ఎప్పటికీ కలగలేదని సానియా స్పష్టం చేశారు. తాను త్వరలో బరిలో నిలబడతానని అయితే అందుకు తాను తొందరపడటం లేదని ఆమె అన్నారు. తన టూర్ కార్యకలాపాలు మొదలు పెట్టే ముందుగా జనవరిలో హాంకాంగ్లో టీమ్ టోర్నీలో పాల్గొంటున్నట్లుగా తెలిపారు
టీం టోర్నీలో ఆసియాకు ప్రాతినిథ్యం వహించడం పెద్ద గౌరవమని సానియా తెలిపారు. జెలేనా, షెరపోవా వంటి మేటి తారలు పాల్గొంటున్న అలాంటి పోటీలో భాగం పంచుకోవడమే ఓ గొప్ప అనుభూతిని ఇస్తుందని చెప్పారు. అయితే హాంకాంగ్ టీమ్ టోర్నీకి ఇంకా రెండున్నర నెలల సమయం ఉంది కాబట్టి అంత సుదీర్ఘ కాలం వేచి ఉండటమే కాస్త కష్టమనిపిస్తోందని సానియా చెప్పారు.