టెన్నిస్లో అత్యంత ప్రాముఖ్యం పొందిన డేవిస్ కప్ టోర్నీకి భారత్ అర్హత సాధిస్తుందా అన్నదే ప్రస్తుతం అభిమానుల్లో రేగుతున్న ప్రశ్న. గతంలో 1998లో ప్రపంచ గ్రూప్లో పోటీపడ్డ భారత్కు ఇప్పటివరకు మళ్లీ అవకాశం రాలేదు. తాజాగా మరోసారి డేవిస్ కప్లో పాల్గొనేందుకై భారత్ శుక్రవారం నుంచి రొమేనియాతో ప్లే ఆఫ్ పోటీల్లో పాల్గననుంది.
రొమేనియా వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో భారత్ విజయం సాధిస్తే డేవిస్ కప్కు అర్హత సాధిస్తుంది. అయితే రొమేనియాతో పోలిస్తే అన్ని విభాగాల్లో బలహీనంగా ఉన్న భారత టెన్నిస్ క్రీడాకారులు అసలు విజయం సాధిస్తారా అన్నదే ప్రశ్న. భారత్ తరపున ప్రకాశ్ అమృత్రాజ్, సోమ్దేవ్లు సింగిల్స్ బరిలో దిగుతున్నారు.
అయితే వీరిలో ప్రకాశ్ ప్రస్తుతం ఫామ్లో లేక పోవడం ఆందోళన కల్గిస్తోంది. దీంతో మొత్తం భారమంతా సోమ్దేవ్పైనే పడనుంది. ప్రస్తుతం 242వ ర్యాంక్లో కొనసాగుతోన్న సోమ్దేవ్ కొద్దిరోజులుగా సంచలన విజయాలు నమోదు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానుల చూపులన్నీ సోమ్దేవ్ పైనే నిలిచాయి. కానీ సింగిల్స్ బరిలో భారత్ కన్నా రొమేనియా ఎన్నో రకాలుగా మెరుగ్గా ఉండడం గమనార్హం.
ఇక ఈ పోటీల్లో భారత్ నుంచి పేస్, భూపతిల జంట డబుల్స్ బరిలో నిలిచింది. డబుల్స్ విభాగంలో మాత్రం పేస్, భూపతీలు సమన్వయంతో ఆడగల్గితే ఈ విభాగంలో రొమేనియాపై భారత్ నెగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డేవిస్ కప్ కోసం జరుగుతోన్న ఈ టోర్నీలో భారత్ అవకాశాలు ఎలా ఉంటాయన్న విషయం కాస్త వేచి చూడాల్సిందే.