ఆస్ట్రేలియాలోని పెర్త్లో ప్రారంభం కానున్న ఫెడ్కప్ టోర్నీలో భారత్ గట్టి పోటీని ఎదుర్కోనుంది. ఆస్ట్రేలియా, భారత్, కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా, న్యూజిలాండ్ ఉజ్భెకిస్థాన్ వంటి 8 దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో భారత్ తరపున తొలి సింగిల్స్లో అంకిత బాంబ్రీ బరిలోకి దిగనుంది.
స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ఈ టోర్నీకి దూరం కావడంతో ఫెడరేషన్ కప్లో పాల్గొంటున్న అంకిత బాంబ్రీపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఆసియా/ ఓషినియా గ్రూప్-1లో చోటును నిలబెట్టుకోవడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతుంది. న్యూజిలాండ్తో తొలిమ్యాచ్లో బరిలోకి దిగనున్న అంకిత బాంబ్రీ... ప్రపంచ 68వ ర్యాంకర్ ఇరాకోవిచ్తో తలపడుతుంది.
గ్రూప్ "ఎ", "బి" విజేతలు ప్రపంచ గ్రూప్-2 ప్లే ఆఫ్ పోటీలతు అర్హత సాధించేందుకు తలపడతారు. రెండో సింగిల్స్లో రష్మీ (505)ని ఆడిస్తామని భారత జట్టు కెప్టెన్ ఎన్రికో పిపెర్నో తెలిపారు.
మరోవైపు.. ఈ ఫెడ్కప్లో భారత్ తరపున అంకిత సోదరీమణి సానా (472 ర్యాంకర్)లతో పాటు అమెరికా సిటిజన్లు సునితా రావు, షికా ఒబరాయ్లు కూడా భారత ప్రభుత్వ అనుమతితో ఫెడ్కప్లో ఆడనున్నారని పిపెర్నో తెలిపారు.
ఇకపోతే.. ఫెడ్కప్లో ఆడే అవకాశం లభించడం పట్ల సానా, అంకిత బాంబ్రీలు హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ నెగ్గిన తమ సోదరుడు యూకీ బాంబ్రీ వలే ఫెడ్కప్లో తాము రాణిస్తామని వారు తెలిపారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా- మహేష్ భూపతిలు విజయం సాధించి.. తమలో అధిక ఉత్సాహాన్ని నింపారని సానా, అంకితలు వెల్లడించారు. ఫెడ్కప్లోనూ భారత్ విజయపరంపర కొనసాగించే విధంగా రాణిస్తామని బాంబ్రీ సిస్టర్స్ తెలిపారు.