కేరళ పరుగుల రాణి పీటీ ఉష అథ్లెట్ విభాగంలో అనేక కొత్త రికార్డులను నెలకొల్పి భారత కీర్తి ప్రతిష్టలు సమున్నతంగా నిలిపింది. స్పింట్ర్ క్వీన్ పీటీ ఉష తన కెరీర్ను మాస్కో ఒలింపిక్ క్రీడల ద్వారా ప్రారంభించింది. ఆసియా క్రీడలలో మెరుగ్గా రాణించి అనేక పతకాలను ఉష సొంతం చేసుకుంది. పీటీ ఉష ఔన్నత్యాన్ని గుర్తించిన ప్రభుత్వం 1985లో పద్మశ్రీ, అర్జున అవార్డులను ప్రధానం చేసింది.
పీటీ ఉష అసలు పేరు పిలావుళ్లకండి తేక్కిపరాంబిల్ ఉష. కేరళ కాలికట్ సమీపంలోని పయ్యోలీ గ్రామంలో 1964 జూన్ 27వ తేదీన పీటీ ఉష జన్మించింది. పీటీ ఉషను అందరూ ముద్దుగా పయ్యోలీ ఎక్స్ప్రెస్గా పిలుస్తారు. ఉష పరుగుల రాణిగా పునాది పడింది 1979 నాటి జాతీయ పాఠశాలల క్రీడల్లో. ఉష ఉత్సాహన్ని తెలుసుకున్న కోచ్ ఓ.మాధవన్ నంబియార్ ఆమెకు శిక్షణ ఇవ్వటానికి ముందుకువచ్చాడు.
ఉష ప్రముఖ అథ్లెటిక్గా మారటంలో నంబియార్ కృషి ఎంతో ఉంది. పీటీ. ఉష కెరీర్లో ఎక్కువ భాగం ఆయన నుంచే శిక్షణ పొంది అనేక పేరు ప్రఖ్యాతులు గడించింది. ఉష అథ్లెట్గా 1980లో మాస్కో ఒలింపిక్స్ ద్వారా ఆరంగ్రేటం చేసింది. అయితే ఈ పోటీల్లో ఉష అంతగా రాణించలేదు. న్యూఢిల్లీలో తొలిసారిగా జరిగిన 1982 నాటి ఏషియాడ్ పోటీల్లో రెండు రజత పతకాలను ఉష సాధించింది.
కువైట్ వేదికగా 1983లో జరిగిన ఏషియాన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఉష కొత్త రికార్డును సృష్టించింది. ఆ తర్వాత జరిగిన ఈ పోటీల్లో 13 స్వర్ణ పతకాలను ఉష కైవసం చేసుకుంది. 1984లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన ఒలింపిక్స్లో తృటిలో కాంస్య పతకాన్ని ఉష కోల్పోయింది. ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా 1985లో జరిగిన ఏషియాన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆరు పతకాలను గెలుచుకుని ఉష రికార్డు సృష్టించింది. ఒకే టోర్నీలో ఆరు పతకాలను తొలిసారి గెలుచుకున్న ఘనత ఉషది. అథ్లెట్గా ఉష 101 అంతర్జాతీయ పతకాలను గెలుచుకుంది.
ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్గా ట్రోఫీని 1985, 1986లోనూ, అలాగే ఆసియా అవార్డును 1984-87, 1989లో పీటీ ఉష అందుకుంది. సియోల్ వేదికగా 1986లో జరిగిన ఏషియాడ్ గేమ్స్లో అత్యుత్తమ అథ్లెట్గా అడిడాస్ గోల్డెన్ షూ అవార్డును ఉష కైవసం చేసుకుంది.