ఈ ఏడాదిలో టెన్నిస్ సీజన్ ముగిసింది. ఈ సీజన్లో సంచలనం రేపే ఫలితాలు.. రికార్డులు... ర్యాంకుల స్థానాల్లోను మార్పులు జరిగాయి. వీటిల్లో అన్నింటికంటే ప్రధానంగా స్విట్జర్లాండుకు చెందిన అగ్రస్థాయి ఆటగాడు రోజర్ ఫెదరర్ను వెనక్కు నెట్టి స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ ముందుకు రావడం విశేషం.
ఇలాంటివి ఈ సీజన్లో ఎన్నో జరిగాయి. అయినప్పటికీ ఫెదరర్, నాదల్ల మధ్య నెలకొన్న పోటీ, వారి స్థానాల గురించే క్రీడా పండితులు ఎక్కువగా చర్చిస్తుండటం గమనార్హం. సీజన్ ప్రారంభం నుంచి నాదల్.. రాకెట్ వేగంతో ప్రత్యర్థులను చిత్తు చేస్తుండగా.. సీజన్ మధ్యలో అనారోగ్యం పాలై తిరిగి కోలుకుని తన ఫాంను దొరకబుచ్చుకునేందుకు తంటాలు పడ్డాడు ఫెదరర్.
ఈ క్రమంలో రారాజుగా వెలగొందిన ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టోర్నీల్లో కంగుతిన్నాడు. ఫలితంగా నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. అయితే తనకు నెంబర్ వన్ కన్నా వింబుల్డన్ టైటిలే ముఖ్యమని ఇటీవలే ఫెదరర్ తన మనోగతాన్ని వెల్లడించాడు.
వింబుల్డన్ తనకు ఎంతో ప్రత్యేకమైనదిగా పేర్కొన్నాడు. ఆ ప్రత్యేకతకు మరో ప్రత్యామ్నాయం లేదని అన్నాడు. 237 వారాల పాటు ప్రపంచ టెన్నిస్ నెంబర్ వన్ ర్యాంకు క్రీడాకారుడిగా వెలుగొంది రికార్డు సృష్టించిన ఫెదరర్ ప్రస్తుతం నాదల్ తర్వాత నెంబర్ టూలోకి వచ్చాడు.
గత శుక్రవారం షాంఘైలో జరిగిన మాస్టర్స్ కప్ సెమీస్ మ్యాచ్లో నాలుగో ర్యాంకు ఆటగాడైన ఆండీ ముర్రే చేతిలో ఫెదరర్ ఓటమి చవిచూశాడు. రెండు వారాల క్రితం వెన్నునొప్పి కారణంగా పారిస్ మాస్టర్స్ టోర్నీలోంచి కూడా ఫెదరర్ మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే.
అదలా ఉంచితే ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల డబుల్స్ టెన్నిస్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన ఫెదరర్.. పీట్ సాంప్రాస్ పేరిట ఉన్న 14 టైటిల్స్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. తన భవిష్యత్ ప్రణాళిక విషయమై ఫెదరర్ మాట్లాడుతూ... వచ్చే సీజన్లో వింబుల్డన్ టైటిల్ను చేజిక్కించుకోవడమే కాకుండా, నెంబర్ వన్ స్థానాన్ని కూడా చేరుకుంటానని ధీమాగా చెబుతున్నాడు.