బీజింగ్ ఒలింపిక్లో తాను సాధించిన స్వర్ణ పతకం దేశంలోని క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని షూటర్ అభినవ్ బింద్రా పేర్కొన్నాడు. తాను స్వర్ణం సాధించడాన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఒలింపిక్లో భారత్ మరిన్ని పతకాలు సాధిస్తుందని బింద్రా ఆశాభావం వ్యక్తం చేశాడు.
బీజింగ్ ఒలింపిక్లో తాను స్వర్ణం సాధించడం వల్ల భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), సాయ్లు క్రీడలకు మరింత ప్రోత్సాహాన్ని అందించగలవని తాను భావిస్తున్నట్టు బింద్రా తెలిపాడు. అలాగే తాను స్వర్ణం సాధించడం ద్వారా దేశంలోని వర్ధమాన క్రీడాకారుల్లో ప్రోత్సాహం పెరుగుతుందని బింద్రా పేర్కొన్నాడు.
ఇలా తాను అనుకున్న విధంగా జరిగితే వచ్చే ఒలింపిక్స్లో భారత్ 15 పతకాలతో తిరిగి వస్తుందని బింద్రా అభిప్రాయపడ్డాడు. బీజింగ్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించడం ద్వారా అభినవ్ బింద్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. బింద్రాకు ముందు ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరపున వ్యక్తిగత స్వర్ణం సాధించిన క్రీడాకారుడే లేకపోవడం గమనార్హం.
అదేసమయంలో మొట్టమొదటగా బీజింగ్ ఒలింపిక్స్లో మాత్రమే భారత్ మూడు పతకాలు సాధించింది. షూటింగ్ విభాగంలో బింద్రా స్వర్ణం సాధిస్తే బాక్సింగ్ విభాగంలో విజేందర్, రెజ్లింగ్లో సుశీల్ కుమార్లు కాంస్య పతకాలు సాధించారు.