బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఆంధ్రతేజం సైనా నెహ్వల్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ను సొంతం చేసుకొంది. తాజాగా చైనీస్ తైపీ గ్రాండ్ ప్రి టైటిల్ను సొంతం చేసుకోవడం ద్వారా ఈ హైదరాబాదీ అమ్మాయి తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకుంది.
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం గతవారం 14వ ర్యాంక్తో కొనసాగుతూ వచ్చిన సైనా రెండు స్థానాలు మెరుగు పర్చుకుని 12వ స్థానం చేరుకుంది. మొత్తం 44,611 పాయింట్లతో సైనా ఈ ఘనత సాధించింది. ఈ ర్యాంక్తో బ్యాడ్మింటన్లో మెరుగైన స్థానం పొందిన భారత క్రీడాకారిణిగా కూడా సైనా రికార్డు సాధించింది.
తాజా ర్యాంకింగ్స్లో భారత నుంచి సైనా తర్వాత మరో ఇద్దరు మహిళలు మాత్రమే టాప్ 100లో స్థానం సాధించారు. సైనా తర్వాత అదితి ముతాత్కర్ 50వ ర్యాంక్ను సాధించగా 74వ ర్యాంక్లో తృప్తి ముర్గుండే నిలిచింది. అదేసమయంలో పురుషుల విభాగంలో చేతన్ ఆనంద్ భారత నెంబర్వన్ స్థానాన్ని సాధించాడు.
మొత్తం 30,614 పాయింట్లతో ఆనంద్ 33వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. ఆనంద్తో పాటు అనూప్ శ్రీధర్ 35వ స్థానంలోను, అరవింద్ భట్ 39వ స్థానంలోను, ఆంధ్రతేజం పారుపల్లి కాశ్యప్ 57వ ర్యాంక్లోను కొనసాగుతున్నారు.