భారత్లో టెన్నిస్ పేరు ఎత్తగానే గుర్తొచ్చేది లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియాల పేర్లు. వీరి తర్వాత అనేక పేర్లు వినిపిస్తున్నా.. వారిలో భారత్కు చెందిన నెంబర్ వన్ ఆటగాడిగా ఎదుగుతున్న సోమ్దేవ్ దేవవర్మన్ అతి స్వల్ప కాలంలోనే అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
ఒకే ఒక ఏడాదిలో వివిధ టోర్నీల్లో పాల్గొన్న సోమ్దేవ్ అటు విజయాలు, అపజయాలతో ఎత్తుపల్లాలను బాగా అవగతం చేసుకున్నాడు. అనుభవాన్ని గడించాడు. సోమ్దేవ్ సాధించిన ఘనతల్లో ప్రధానంగా చెన్నై ఓపెన్ ఒకటి.. రెండోది డేవిక్ కప్లో హీరోగా ఎదగడం.
ఈ రెండూ సోమ్దేవ్ కెరీర్ మలుపు తిరగడానికి అతికీలకమైనవిగా చెప్పొచ్చు. తన సహచర ఆటగాళ్లు డబుల్స్లో రాణించేందుకు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తుంటే.. సోమ్దేవ్ మాత్రం సింగిల్స్లోనే కఠోరంగా శ్రమిస్తూ ముందుకు సాగుతున్నాడు. గత వారం తొలిసారిగా సోమ్దేవ్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు(129)ను నమోదు చేశాడు.
ఈ సందర్భంగా సోమ్దేవ్ మాట్లాడుతూ, వేగంగా పరిగెడుతున్న ఈ కాల గమనంలో ఎన్నో అవకాశాలు తన దరికి చేరుతున్నాయన్నాడు. ఇంతటి చక్కటి అవకాశాలను సరైన సమయంలో చేజిక్కించుకోవాలని తెలిపాడు. ఇప్పటి వరకు తాను సాధించి అత్యల్పం అని.. యూఎస్, వింబుల్డన్ టోర్నీల్లో రాణించాల్సి ఉందన్నాడు.
యూఎస్ ఓపెన్తో గ్రాండ్ స్లామ్లోకి తాను అడుగినప్పటికీ.. అందులో ఏమీ జరగలేదన్నాడు. యూఎస్ ఓపెన్లో ఆడటాన్ని తాను ఆస్వాదిస్తానని ఈ సారి అత్యుత్తమ ఆటతీరుతో రాణించగలనని ధీమా వ్యక్తం చేశాడు. వింబుల్డన్ డబుల్స్లో కెవిన్ ఆండర్సన్తో కలిసి క్వాలిఫై అవ్వడం సంతృప్తినిచ్చిందన్నాడు. కానీ సింగిల్స్పైనే తాను ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపాడు.
అదలా ఉంచితే.. సోమ్దేవ్ కెరీర్లో ర్యాంకింగ్ గ్రాఫ్ చూస్తే.. ఆరోహణ మార్గంలోనే పయనిస్తోంది. ఇప్పటి వరకు ఐతే సరే ఇక ముందు ముందు తన ఆటకు మరింత పదును పెడుతూ మంచి ప్రదర్శన ఇవ్వగలిగితే.. గ్రాండ్ స్లామ్లో దిగ్గజాలకు సైతం సవాలు విసరగల స్థాయికి సోమ్దేవ్ చేరగలడని క్రీడా పండితుల విశ్లేషణ. భారత ఏదేమైనప్పటికీ.. ఆశాకిరణంగా ఉదయిస్తున్న ఈ యువకెరటం దేశానికి పేరు తెచ్చే మరెన్నో విజయాలను అందుకోవాలని ఆశిద్దాం.