వచ్చే ఏడాది న్యూఢిల్లో జరిగే ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. అయితే అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో పోటీనివ్వడానికి ఇక్కడి రెజ్లర్లకు తగినంత సౌకర్యాలు అందుబాటులో లేవని రెజ్లింగ్ విభాగంలో తొలి ద్రోణాచార్య అవార్డును కైవసం చేసుకున్న భాల్ భగ్వత్ వెల్లడించారు.
కాలిఫోర్నియా నుండి ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జాతీయ రెజ్లర్ల నైపుణ్యాన్ని తాము పరిశీలించామన్నారు. ఎక్కడైతే రెజ్లర్లు శిక్షణ పొందుతున్నారో.. అక్కడే ఈ రెజ్లర్లకు ప్రత్యేక ల్యాబ్ రూమ్లు ఉన్నాయని తెలిపారు.
ఈ ప్రత్యేక ల్యాబ్ అధునాతమైన పరికరాలు, మౌలికసదుపాయాలను కలిగి ఉంటుంది. ఈ ల్యాబ్లో చీఫ్ కోచ్కు సహాయక కోచ్లుగా ఎంపికైన వారు ఉంటారు. ట్రైనింగ్ సెషన్లలో స్త్రీ, పురుషులిరువురికీ ఈ ప్రత్యేక ల్యాబ్ అందుబాటులో ఉంటుందని భగ్వత్ వివరించారు.
రెజ్లర్లకు సకల సౌకర్యాలతో కూడిన గదులను ఇస్తున్నారని.. రెజ్లర్లు ఉండే కాంప్లెక్స్లోనే సంబంధింత క్రీడా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క రెజ్లింగ్ విభాగంలోనే కాదు.. వాలీబాల్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, ఫుట్బాల్ తదిత క్రీడల్లో ఇలాంటి ధోరణి కనిపిస్తోందన్నారు. భారత్లోను ఇదే తరహా కాంప్లెక్స్లను అందుబాటులోకి తేవాలని అభిప్రాయపడ్డారు.
మహిళా రెజ్లర్ల జాతీయ చీఫ్ రెజ్లింగ్ కోచ్ పీఆర్ సొంధీ మాట్లాడుతూ.. భారత్లో క్రీడా మౌలికసదుపాయాల కొరత ఉందన్నారు. ఈ కొరత వల్ల ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల కోసం రెజ్లర్లను సిద్ధం చెయ్యడానికి క్లిష్టమవుతోందన్నారు. ప్రస్తుతం హర్యానాలో చాలా మంది తల్లిదండ్రులు చదువు కన్నా తమ పిల్లలు రెజ్లింగ్, బాక్సింగ్ విభాగాల్లో రాణించాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.
కాగా, గత ఏడాది బీజింగ్ ఒలింపిక్స్లో సుశీల్ కుమార్ కాంస్య పతకాన్ని గెలుచుకోవడంలో సొంధీ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈయన వచ్చే ఏడాదిలో జరిగే కామన్వెల్త్ క్రీడల కోసం భారత రెజ్లర్లను సిద్ధం చేస్తున్నారు.