Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడు సముద్రాల సంగమ క్షేత్రం "కన్యాకుమారి"

మూడు సముద్రాల సంగమ క్షేత్రం
FILE
భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని "కన్యాకుమారి" పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటాడు. ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం, చంద్రోదయాలను చూసి పులకించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు.

కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసముద్రం, దిగువన హిందూ మహాసముద్రం.. వీక్షకుల్ని పరవశింపజేస్తుంటాయి. సముద్రతీర ప్రకృతి రమణీయతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని "థోరియం" ధాతువుతో కూడిన ఇసుక రేణువులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటారు. అలాగే వారణాసి పరమశివుడికి నివాస స్థలమైనట్లుగా, కన్యాకుమారి పార్వతిదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు.

కన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్, తిరువళ్లువర్ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమరి ఆలయం తదితరాలు ముఖ్యమైనవి. అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు, వృక్షాలను కూడా చూడవచ్చు. ఇంకా పెలికాన్, ఫ్లెమింగ్, స్పూన్‌బిల్, అనేక రకాల బాతులు.. కన్యాకుమారికి వలస వస్తుంటాయి. ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ముందుగా చెప్పుకోవాల్సింది "వివేకానంద రాక్". ఇక్కడ క్రీస్తు శకం 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1970వ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివేకానందుడి రాక్‌కు కొంత దూరంలో పార్వతిదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సుచేసిన ప్రాంతం, అక్కడ శిలారూపంలోని ఆమె పాద ముద్రికలను వీక్షించవచ్చు.

ఆ తరువాత చూడాల్సింది "తిరువళ్లువర్ విగ్రహం". వివేకానంద రాక్‌కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్ కరుణానిధి ఆవిష్కరించారు. ఈ తిరువళ్లువర్ విగ్రహం బరువు ఏడువేల టన్నులు కాగా.. చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవలలో వెళ్లాల్సిందే. ఇది ఆసియాలోని ఎత్తైవిగ్రహాలలఒకటిగా పేరుగాంచింది.

"మహాత్మాగాంధీ స్మారక మంటపం" చూడదగ్గ మరో ప్రదేశం. గాంధీజీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి జయంతి అయిన అక్టోబర్ 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా నిర్మించారు.

బాణాసురుడిని సంహరించిన అమ్మవారి "కుమరి ఆలయం" చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. మూడువైపులా ఎత్తైన గోడలున్న ఈ ఆలయంలో మూడు ప్రాకారాలున్నాయి. ఆలయంలోని ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేలా ఉంటుంది. ఒకప్పుడు దేవి ముక్కెరలోని రత్నపు కాంతి నావికులను ఆకర్షించి నావలు రేవులోని బండరాళ్లను ఢీకొనేవని చెబుతుంటారు. బంగాళా ఖాతానికి అభిముఖంగా ఉండే ఈ ఆలయ ద్వారాన్ని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు. సంవత్సరంలో ఓ నాలుగైదుసార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు.

webdunia
FILE
పురాణ కథనాల ప్రకారం కుమరి ఆలయంలో దేవతగా కొలువబడుతున్న కన్యాదేవి, పరమశివుడిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడిందట. అయితే ముహూర్తం సమయానికి కూడా శివుడు రాకపోవటంతో విందుకు సిద్ధంచేసి పెట్టుకున్న బియ్యం రాశులను, మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని చెబుతుంటారు.

అదలా ఉంచితే.. కన్యాకుమారివద్దనున్న దక్షిణ భారతదేశాని చివరి సరిహద్దు అయిన ఇందిరాపాయింట్ చూసేందుకు దేశం నలుమూలలనుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలు కట్టిపడేస్తాయని చెప్పవచ్చు. అలాగే కన్యాకుమారి శివార్లలోని ఉదయగిరి కోట, విట్టకొట్టాయ్ కోటలు చూడదగ్గవే. కన్యాకుమారికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే తమిళులకు ప్రీతిపాత్రమైన స్వామితోప్ పతి ఆలయం చూడదగ్గదే.

ప్రముఖ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న కన్యాకుమారి "రాక్ లాబ్‌స్టర్స్" అని పిలిచే భారీ సైజు రొయ్యలకు కూడా ప్రసిద్ధి చెందినది. సగటున రెండు కేజీల బరువుండే ఈ లాబ్‌స్టర్ల ధర 5 వేల రూపాయల పైమాటే. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధనా సంస్థ వాణిజ్య ప్రాతిపదికన కేజ్ కల్చర్‌ద్వారా ప్రత్యేకంగా పెంచబడే ఈ లాబ్‌స్టర్లను ఎక్కువగా జపాన్, హాంకాంగ్ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.

కన్యాకుమారి, మండపం, కేరళలోని విళింజం వంటి తీర ప్రాంతాల్లోనే ఈ లాబ్‌స్టర్లు ఎక్కువగా దొరుకుతుంటాయి. తీరం నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి కాబట్టే వీటికి రాక్‌ లాబ్‌స్టర్స్‌ అనే పేరు వచ్చింది. ఇవి రాళ్ల చుట్టూ ఉంటాయి కాబట్టి రొయ్యల్లా ట్రాలింగ్‌ చేసి మొత్తం ఊడ్చి పట్టేయడం సాధ్యపడదు. వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతూ ఉంటాయి. సెప్టెంబరు-జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేందుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంభిస్తుంటారు.

చెన్నై నగరానికి 743 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారి ఎలా వెళ్లాలంటే.. విమాన మార్గంలో అయితే, మధురై నుంచి 250 కిలోమీటర్లు, తిరువనంతపురం నుంచి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్లవచ్చు. చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు.

వసతి విషయానికి వస్తే.. కన్యాకుమారిలో పలు చిన్న, పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్, దేవస్థానంవారి కాటేజీలు, ట్రావెలర్స్ బంగళా, అతిథి గృహాలు.. పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా రైల్వేస్టేషన్‌లో రిటైరింగ్ రూములు కూడా వసతికి వీలుగా ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu