Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరోగ్యాన్ని ప్రసాదించే గుణదల కొండ మేరీమాత

Advertiesment
పర్యాటకం పుణ్యక్షేత్రాలు ఆరోగ్యాన్ని ప్రసాదించే గుణదల కొండ మేరీమాత
, సోమవారం, 28 జులై 2008 (12:58 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో గల గుణదల కొండ మేరీ మాతను దర్శిస్తే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. అందుకే క్రీస్తు తల్లిగా పిలవబడే మేరీ మాత ఆలయమున్న ఈ ప్రాంతానికి క్రైస్తవులతో పాటు వివిధ మతాలకు చెందినవారు సైతం విచ్చేస్తుంటారు.

గుణదల కొండపై వెలసిన మేరీమాతను దర్శిస్తే వ్యాధులు నశించి ఆరోగ్యం సమకూరడమే కాకుండా జీవితంలో సకల సుఖాలు కల్గుతుందని భక్తులు చెబుతుంటారు. ఈ కారణంగానే ఫిబ్రవరి నెలలో జరిగే మూడురోజుల ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఈ కొండకు వస్తుంటారు.

తిరుణాల సందర్భంగా లక్షల సంఖ్యలో గుణదల కొండకు వచ్చే భక్తులతో ఈ ప్రాంతం విశేష ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంది.

గుణదల కొండ విశేషాలు
ఈ కొండ పైభాగాన ఉన్న సహజసిద్ధ గుహలో మేరీమాత విగ్రహం ఏర్పాటు చేయబడి ఉంది. ఈ కొండపైకి చేరుకునే దారిలో దాదాపు 12 ప్రదేశాల్లో క్రీసును శిలువ వేసిన ముఖ్య విశేషాలను వివరిస్తూ స్థూపాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఈ స్థూపాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి.


అలాగే కొండపై భాగంలో దాదాపు 18 అడుగుల ఎత్తైన శిలువ ఆకారాన్ని ప్రతిష్టించారు. ఈ శిలువను తాకితే పాపాలు కరిగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే ఈ కొండపై మేరీమాత ఆలయానికి సమీపంలో ఓ చర్చిని కూడా నిర్మించారు.

మేరీమాత ఉత్సవాల విశిష్టత
దాదాపు 1947 నుంచి ఈ ప్రాంతంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి తొమ్మిది నుంచి 11 వరకు మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో ఈ ఉత్సవాలను ఒక్కరోజు మాత్రమే నిర్వహించేవారు. అయితే ప్రతి ఏడాదీ పెరుగుతున్న రద్ధీని దృష్టిలో ఉంచుకుని గత కొన్నేళ్లుగా ఈ ఉత్సవాలను మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతోంది.

ఈ మేరీమాత ఉత్సవాలకు క్రైస్తవేతరులు తరలిరావడంతో పాటు కొన్ని హిందూ సాంప్రదాయాలు సైతం ఇక్కడ కన్పిస్తాయి. మూడురోజులపాటు సాగే ఈ ఉత్సవాల్లో భక్తులు తలనీలాలు సమర్పించడం, కొబ్బరికాయలు కొట్టడం, పిల్లలకు అన్నప్రాసన చేయడం చేస్తుంటారు.

అలాగే పిల్లలు లేనివారు ఇక్కడున్న చెట్టుకు ఊయలలు కడుతుంటారు. వీటితోపాటు మొక్కులు తీర్చుకోవడం, గుడివద్దే నిద్రలు చేయడం లాంటివి కూడా ఇక్కడ మనం చూడవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu