తిరుమల తిరుపతి అన్నప్రసాదం మెనూలో అదనంగా మరో వంటకాన్ని చేర్చారు తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు. శ్రీవారి ప్రసాదంలో ఇంతకుముందు వున్నటువంటి ఓ వంటకాన్ని తిరిగి భక్తులకు అందించాలన్న తన ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. వెంటనే ముఖ్యమంత్రి తితిదే చైర్మన్ యోచనకు అంగీకారం తెలపడంతో భక్తులకు ఈరోజు నుంచి రుచికరమైన అన్నప్రసాదంలో మరో వంటకం వచ్చి చేరింది.
ఈ సందర్భంగా తితిదే చైర్మన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేస్తూ... ఉ 10:30 నుండి సా 4 గంటల వరకు ప్రతిరోజు 35 వేల గారెలను భక్తులకు వడ్డిస్తాం. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి, భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తాం'' అని పేర్కొన్నారు.
ఈ సందేశాన్ని చూసిన పలువురు భక్తులు వడ్డిస్తున్నవి గారెలు కాదు చైర్మన్ గారూ... అవి వడలు అంటూ వెల్లడిస్తున్నారు. మరికొందరేమో.. ఈ వడలు ఎందుకండీ చక్కగా దీని బదులు ప్రసాదంగా ఇచ్చే పెద్ద వడలు అందరికీ లభ్యం అయ్యేటట్లు చూడండి అంటూ సలహా ఇస్తున్నారు.