తితిదే ఆధ్వర్యంలో నడుపబడుతున్న ఆలయాల్లో ఈనెల, జూన్ నెలల్లో వరుసగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కార్వేటినగరంలోని శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు మే 28వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
మే 27వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 28వ తేదీ మిథున లగ్నంలో ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేషవాహనం, 29వ తేదీ చిన్నశేషవాహనం, హంసవాహనం, 30వ తేదీ సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం, 31వ తేదీ కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, 1వ తేదీ మోహినీ అవతారం, గరుడవాహనం, 2వ తేదీ హనుమంతవాహనం, గజవాహనం, 3వ తేదీ సూర్యప్రభవాహనం, చంద్రప్రభవాహనం, 4వ తేదీ రథోత్సవం, అశ్వవాహనం, 5వ తేదీ చక్రస్నానంలు జరుగనున్నాయి.
మే 31వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు స్వామివారి కళ్యాణోత్సవంను తితిదే నిర్వహించనుంది. కళ్యాణోత్సవంలో పాల్గొనే వారికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పంను బహుమానంగా తితిదే అందించనుంది. ఈ సందర్భంగగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్మాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృఇక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.